సుప్రీం తీర్పు షెడ్యూలు కులాల అభ్యున్నతికి తోడ్పడాలి

మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్  

ఆ తీర్పును అవకాశవాద రాజకీయాలకు వినియోగించొద్దు

మనసా, వాచా, కర్మేణా అందరికీ న్యాయం జరగాలి

ఎస్సీలను బలోపేతం చేయడానికి ఆ తీర్పు వినియోగించాలి

ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణ విషయంలో ఈరోజు (గురువారం) గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూలు కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని.. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆయా వర్గాలు సాధికారిత సాధించాలన్న సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగానూ, ఐదేళ్ల పరిపాలనలోనూ పార్టీ అనేక చర్యలు తీసుకుందని ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మంత్రి పదవులతో పాటు, నామినేటెడ్‌ పదవుల కేటాయింపు, అమలు చేసిన పథకాలు, ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు దీనికి నిదర్శనంగా నిలుస్తాయని ఆయన గుర్తు చేశారు. అణగారిన కులాల్లో ఏ రెండు వర్గాలున్నా కూడా.. రెండు కళ్లు మాదిరిగానే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భావించిందన్న ఆయన, అలాగే చూసిందని కూడా చెప్పారు. 
    ఎస్సీల వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వినియోగించుకోకుండా, ఆ తీర్పు స్ఫూర్తిని మనసా, వాచా, కర్మేణా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని.. అలాగే ఆ తీర్పును ఎస్సీలను బలోపేతం చేయడానికి వినియోగించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటోందని ఆదిమూలపు సురేష్‌ వివరించారు.

Back to Top