వైయ‌స్ జగన్‌ గారి భద్రత కల్పనలో ప్రభుత్వం విఫలం

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ధ్వజం

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌.

వైయ‌స్ జగన్‌గారి పర్యటనకు ఆంక్షల విధింపు అభ్యంతరకరం

జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నేతను ఎక్కడో తిప్పడం దారుణం

ప్రెస్‌మీట్‌లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆక్షేపణ

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్  ధ్వజమెత్తారు. జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన వైయ‌స్ జగన్‌గారిని ఇరుకు రోడ్లలో, పల్లెటూళ్ల మీదుగా తీసుకురావడం దారుణమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ ఆక్షేపించారు.

ప్రెస్‌మీట్‌లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఏం మాట్లాడారంటే..:

దురుద్దేశంతోనే తొలుత మార్పు:
    ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైయ‌స్‌ జగన్‌గారి పర్యటనకు సంబంధించి, రెండు రోజుల ముందుగానే రూట్‌ మ్యాప్‌తో సహా సమాచారం ఇవ్వడం జరిగింది. దానిపై చాలా నింపాదిగా ముందు రోజు రాత్రి స్పందించిన పోలీసులు, విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను సాకుగా చూపి, రూట్‌ మార్చుకోవాలంటూ నోటీస్‌ ఇచ్చారు. దానికి అంగీకరించిన వైయ‌స్ జగన్‌గారు, ముందు అనుకున్నట్లు వారధి, కనకదుర్గమ్య ఫ్లైవర్‌ మీదుగా కాకుండా, మంగళగిరి బైపాస్, ఖాజా వెస్ట్‌ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మీదుగా దాదాపు 50 కి.మీ ప్రయాణించి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. ఆ ప్రయాణంలోనూ తాడేపల్లి మొదలు, ప్రతి చోటా అడ్డంకులు సృష్టించారు. కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట రాకుండా కుట్ర చేశారు. అయినా వేలాదిగా తరలి రావడంతో.. దాదాపు 50 కి.మీ దూరానికి 5 గంట‌ల‌కు పైగా పట్టింది.

తిరుగు ప్రయాణంలోనూ కుట్ర:
    జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వైయ‌స్ జగన్‌గారు ఇబ్రహీంపట్నం నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించారు. చివరకు ఎక్కడి నుంచి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పలేదు. రాత్రి వేళ ఇబ్రహీంపట్నం నుంచి నేరుగా వచ్చే అవకాశం ఉన్నా, చెప్పా పెట్టకుండా రూట్‌ మార్చేశారు. కనీసం వైయ‌స్ జగన్‌గారి వ్యక్తిగత సిబ్బందికి కూడా రూట్‌ గురించి సమాచారం ఇవ్వలేదు. రాజధాని ప్రాంతంలోని ఊళ్లలో నుంచి  ఇరుకు రోడ్ల మీదుగా తీసుకొచ్చారు. భద్రతకు ఏ మాత్రం అనువుగా లేని ప్రాంతాల మీదుగా, రాత్రి వేళల్లో ఒక మాజీ సీఎం, అత్యంత ప్రజాదరణ ఉన్న పార్టీ నేత.. అది కూడా జడ్‌ ప్లస్‌ కేటగిరీ ఉన్న నేతను అలా తీసుకురావడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అలా ఏకపక్షంగా వైయ‌స్ జగన్‌గారి కాన్వాయ్‌ని మళ్లించడం ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని, ఇకనైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్పష్టం చేశారు.

Back to Top