మంత్రి అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి

సభలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలి

టీడీపీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేయాలి 

వైయ‌స్ఆర్‌సీపీ జనరల్‌ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ  జనరల్‌ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి.

మండలిలో కులమతాల ప్రస్తావన తీసుకురావడం హేయం 

మండలి చైర్మన్‌ కి మతం, పార్టీ ఆపాదించడం సిగ్గుచేటు

తాను క్రిస్టియన్‌ కాదు అని చెప్పుకోవాల్సిన దుస్థితి కల్పించారు

హెరిటేజ్‌ అవినీతికి సమాధానం చెప్పుకోలేకే ఈ దిగజారుడు రాజకీయాలు

స్పష్టం చేసిన గడికోట శ్రీకాంత్‌ రెడ్డి 

తాడేపల్లి: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్‌కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్‌ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ  జనరల్‌ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు.. మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన బెట్టి శాసనమండలి చైర్మన్‌ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజును చీకటిరోజుగా చూడాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జి.శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో జి.శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

మండలి ఛైర్మన్‌ను అవమానించడం దారుణం:
    కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడిన హెరిటేజ్‌ అంశం మండలిలో చర్చకు రావడంతో దానికి సమాధానం చెప్పలేక సభలో లేని వైయస్‌ జగన్‌ గారు, మండలి చైర్మన్లు క్రిస్టియన్లు అని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పైగా మీ నాయకుడు జగన్‌ అంటూ మండలి చైర్మన్‌కు పార్టీని ఆపాదించి అవమానించారు. ఇది దారుణం.    
    ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ చేసిన టీటీడీ నిధుల దోపిడీపై వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం సభను పక్కదోవ పట్టించడానికి చైర్మన్‌ని రాజకీయాల్లోకి లాగి మతాన్ని, పార్టీని ఆపాదించింది. 

అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన:
    అధికార పార్టీ సభ్యులం అన్న విషయమే మరిచిపోయి వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు మాట్లాడుతుండగా ప్రసంగానికి పదులసార్లు అడ్డుతగలడమే కాకుండా మంత్రులంతా పోడియం చుట్టుముట్టి సభలో ఆందోళన చేయడం సిగ్గుచేటు. నేను ఫలానా మతం అని మండలి చైర్మన్‌ చెప్పుకునే దుస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే ఎవరికైనా కులమతాలు అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పకనే చెబుతున్నారు. 

అచ్చెన్నాయుడిపై చర్య తీసుకోవాలి:
    ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కలగజేసుకుని మంత్రి కె.అచ్చెన్నాయుడిని రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్‌ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే సరిపోదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేయాలి. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగినందుకు కూటమిని ప్రజలు అసహ్యించుకుంటుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమతాలతో రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని జి.శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు.

Back to Top