ఎన్టీఆర్ జిల్లా: గుండెపోటుతో మృతి చెందిన వైయస్ఆర్సీపీ చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు డి. రాంబాబు భౌతికకాయానికి పలువురు వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. చిల్లకల్లులో ఏర్పాటు చేసిన రాంబాబు పార్థివదేహాన్ని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాంబాబు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడని, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. రాంబాబు మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. జగ్గయ్యపేట వైయస్ఆర్సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు కూడా రాంబాబు భౌతికకాయానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. రాంబాబు సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితర నాయకులు కూడా రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. రాంబాబు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి పనిచేసేవారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు భారీగా పాల్గొని రాంబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు.