ఎస్పీఎస్ఆర్ నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటాచలం మండలం వడ్డీ పాలెం గ్రామానికి చెందిన 6వ వార్డు సభ్యురాలు ఉప్పు మంజుల, రాఘవేంద్ర ఆధ్వర్యంలో సుమారు 40 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి అవినీతి, అక్రమాలను తట్టుకోలేక ప్రజలు అధికార పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని విమర్శించారు. ప్రజల ఈ తీర్పుతో సోమిరెడ్డి రాజకీయ అధ్యాయం ముగిసిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరిన వారిని పార్టీ యోధులుగా భావిస్తున్నామని కాకాణి తెలిపారు. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా టీడీపీని వదిలి పార్టీకి చేరడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం తగ్గిపోయిందని, అధికారంలో ఉన్నారనే భావంతో కొందరు మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్నారని విమర్శించారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు అనేక మంది సంప్రదింపులు జరుపుతున్నారని, స్థానిక నాయకత్వం సూచనల మేరకే పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని ఆయన వెల్లడించారు. స్థానికంగా పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న నాయకులను కాదని ఎవరినీ పార్టీలోకి అనుమతించబోమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ బలంగా నిలుస్తోందని, భవిష్యత్తులో తిరుగులేని రాజకీయ శక్తిగా పార్టీని తీర్చిదిద్దుతామని కాకాణి స్పష్టం చేశారు. పార్టీకి చేరిన కుటుంబాలతో పాటు వారిని పార్టీలో చేర్పించేందుకు కృషి చేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకట శేషయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.