చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత 

ఎంపీ గురుమూర్తి 

న్యూఢిల్లీ: పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ బిల్లు పరిమాణంలో చిన్నదైనా, దాని ప్రభావం ఎంతో పెద్దదిగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టపరమైన స్పష్టతను తీసుకురావడంలో ఈ సవరణ ముఖ్య పాత్ర పోషించినప్పటికీ, ఇంకా కొన్ని కీలక అంశాల్లో లోపాలు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు.

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, సెక్షన్–104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఈ సవరణ ద్వారా చట్టాల్లో స్పష్టత పెరిగి అనవసర న్యాయ వివాదాలు, చట్టపరమైన అయోమయాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఒకే కోడ్, ఒకే రద్దు నిబంధన అమలులో ఉండడం వల్ల పెట్టుబడిదారులకు మరింత స్పష్టత లభిస్తుందని చెప్పారు. దీని ఫలితంగా విశాఖపట్నం, శ్రీసిటీ, కొప్పర్తి, కృష్ణపట్నం వంటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు దీర్ఘకాలిక పెట్టుబడులు ఆకర్షితమయ్యే అవకాశముందని ఆయన వివరించారు.

గతంలో కుదిరిన అవార్డులు, ఒప్పందాలు, కొనసాగుతున్న కేసులు యథాతథంగా కొనసాగుతాయనే భరోసా ఈ బిల్లులో ఉండటం వల్ల కార్మికుల హక్కులు భద్రంగా ఉంటాయని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఈ రద్దు నిబంధన స్వయంచాలకంగా అమలులోకి రావడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశ్వసనీయ పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తింపు పొందుతుందని అన్నారు.

అయితే ఈ సవరణ బిల్లు సాంకేతిక అంశాలకే పరిమితమైందని ఎంపీ గురుమూర్తి విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల దుర్వినియోగం, వేతనాల ఆలస్యం, భద్రతా లోపాలు, అనౌపచారిక ఉపాధి వంటి సమస్యలకు ఈ బిల్లు సమగ్ర పరిష్కారం చూపలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రమాధారిత రంగాల్లో పనిచేస్తున్న అస్థిర ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలు అవసరమని సూచించారు.

జాతీయ స్థాయిలో ఒకే కోడ్ అవసరమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో భూసేకరణ, పునరావాసం, ఎస్‌ఈజెడ్‌లలో ఉపాధి అవకాశాలపై రాష్ట్ర స్థాయి బలమైన చర్చా వ్యవస్థలు ఉండాలని ఎంపీ గురుమూర్తి అభిప్రాయపడ్డారు. కార్మికులకు చట్టాలపై అవగాహన పెంచేందుకు సరళమైన సమాచార ప్రచారం, న్యాయ సహాయం అందించే వ్యవస్థలు ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరారు.

ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘటనను ఎంపీ గురుమూర్తి ప్రస్తావించారు. నాలుగు నుంచి నాలుగున్నర వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కసారిగా తొలగించిన సంఘటన చట్టాల స్పష్టత ఎంత అవసరమో చూపించిందని అన్నారు. చట్టాల్లో స్పష్టత లేకపోతే కార్మికులు, యాజమాన్యాల మధ్య గందరగోళం పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

స్పష్టమైన, ఏకీకృత పారిశ్రామిక సంబంధాల కోడ్ అమలుతో సంస్కరణలు కార్మికుల జీవనాధారాలకు భంగం కలగకుండా సమతుల్యత సాధ్యమవుతుందని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, కార్మికుల సంక్షేమం – ఈ మూడు లక్ష్యాల మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Back to Top