పోలింగ్‌ సరళిని పరిశీలించిన గోపిరెడ్డి

ఏపీలో కొనసాగుతున్న రీ పోలింగ్‌
 

 
అమరావతి : గుంటూరు కేసానుపల్లిలో రీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయులు ...పోలింగ్‌ సరళిని పరిశీలించారు. గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలోని నల్లచెరువు బూత్‌ నంబర్‌ 244లో జరుగుతున్న రీ పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్  పసుపు కండువా వేసుకుని రావడంపై వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ సుధాకర్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా పసుపు కండువాతోనే గల్లా జయదేవ్‌ను అక్కడ అధికారులు పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించారు. దీనిపై వైయ‌స్ఆర్‌ సీపీ ఏజెంట్‌ అభ్యంతరం తెలిపారు.

ఉదయం 9గంటల వరకూ నమోదైన పోలింగ్‌
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 94వ పోలింగ్‌ స్టేషన్‌ కేశానుపల్లిలో 18.87 శాతం పోలింగ్‌ నమోదు
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్‌ స్టేషన్‌ నల్లచెరువులో 13.32 శాతం పోలింగ్‌
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 247 పోలింగ్‌ స్టేషన్‌ కలనుతలలో 9.53 శాతం పోలింగ్‌ నమోదు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 41 పోలింగ్‌ స్టేషన్‌ ఇసుకపల్లిపాలెంలో (కోవూరు) 13.28 శాతం
సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్‌ 197 పోలింగ్‌ స్టేషన్‌ అటకానితిప్పలో (ప్రకాశం)లో 30.47 శాతం
 
(కేశానుపల్లి –  956 మంది ఓటర్లు)
(నల్లచెరువు – 1,376 మంది ఓటర్లు)
(కలనూతల 1,070 మంది ఓటర్లు)
(ఇసుకపాలెం 1,084 మంది ఓటర్లు)
(అటకానితిప్ప 578 మంది ఓటర్లు)  

కలనూతలలో ప్రశాంతంగా రీ పోలింగ్‌
ప్రకాశం జిలా ఎర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో రీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో కలనూతలలో రాత్రి పన్నెండు తరువాత కూడా క్యూ లో ఓటర్లు వున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఓటు వేయలేకపోయారు. దీంతో రాజకీయ పార్టీలు, ఓటర్లు విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం రీ పోలింగ్‌ నిర్వహిస్తోంది. కలనూతల 247 పోలింగ్ బూత్‌లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్‌ కొనసాగుతోంది.

ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఇసుకపాలెంలో రీ పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచే క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు. రీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఏడు గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం
రాష్ట్రంలో అయిదు పోలింగ్‌ స్టేషన్లలో నిర్ణీత సమయానికి మాక్‌ పోలింగ్‌ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సోమవారం ఉదయం తెలిపారు. సరిగ్గా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైందని ఆయన చెప్పారు.
 

అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 5.30 గంటలకే అధికారులు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో 7 గంటలకు రీ పోలింగ్‌ మొదలైంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు .

Back to Top