నరసరావుపేట: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. నరసరావుపేటలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక వైయస్ఆర్సీపీ నేతలను తప్పుడు కేసులతో భయపెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీపై ఉందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉంది. రాయలసీమ, పల్నాడులో ఒకప్పుడున్న ఫ్యాక్షనిజం ఇప్పుడు చంద్రబాబు పాలనలోనూ కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్న ఆరాటం తప్పించి ప్రజా సంక్షేమం, సుపరిపాలన చేయాలన్న ఆలోచన సీఎం చంద్రబాబుకి లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక తిరిగి పుంజుకోవడానికి చంద్రబాబుకి రెండున్నరేళ్లు పట్టింది, కేసీఆర్ కి ఏడాదిన్నర పట్టింది. కానీ జగన్ మాత్రం ఆరు నెలల్లోనే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తున్నాడని చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు ఆర్కే ఏబీయన్ వీకెండ్ కామెంట్లోనే చెప్పాడు. ఓడిపోయినా జగన్ లో ఆ కుంగుబాటు లేదేంటనే బాధ కూటమి నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓడిపోతే ఎందుకు ఆగిపోవాలి? నేటి ఓటమే రేపటి గెలుపునకు నాంది కావాలని నమ్మిన వ్యక్తి వైయస్ జగన్. అందుకే రైతులు, యువత, విద్యార్థులు, మహిళల పక్షాన నిలబడి పోరాడుతున్నారు. కక్షసాధింపులకే పోలీస్ యంత్రాంగం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే యువతను అన్యాయంగా అక్రమ కేసులతో వేధిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి తప్పుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ ప్రశ్నించడం నేరమా? తెనాలిలో పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దళిత, మైనారిటీ యువకులను లాఠీలతో నడిరోడ్డు మీద చావబాదితే ఇదేం అన్యాయం అని అడగడం తప్పా? చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఒక మహిళను అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి కొడితే.. ఆ నిందితులను పోలీసులు ఎందుకు నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టలేదు? సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల దళిత బాలికను టీడీపీ యువకులు రెండేళ్లపాటు సామూహిక అత్యాచారం చేస్తే, వారిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? సత్తెనపల్లిలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యాయత్నం చేస్తే దానికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? తప్పు చేసిన నిందితులను శిక్షించాలనుకుంటే ఇలా ఒక్కోచోట ఒక్కోలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారు. రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతే బెట్టింగుల్లో నష్టాలపాలై ఆత్మహత్య చేసుకున్నాడని దుష్ప్రచారం చేశారు. పైగా వైయస్ జగన్ 2024 ఎన్నికల్లో గెలుస్తామని చెబితే ఆ మాట నమ్మి బెట్టింగ్ పెట్టాడని ఇంకో ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు 2004, 2009, 2019 ఎన్నికల్లో కార్యకర్తలకు గెలుస్తామని చెప్పలేదా? ఓడిపోతామని ఎక్కడైనా చెప్పాడా? సింగయ్య మృతి కేసులో వైయస్ జగన్పై కుట్ర వైయస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కార్యకర్తలను ఎన్నో నిర్బంధాలకు గురిచేస్తున్నారు. కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయనకు రోప్ పార్టీ, పెట్రోలింగ్ వాహనాలు, కాన్వాయ్లో అంబులెన్స్ వంటి సౌకర్యాలు కల్పించకుండా భద్రతను గాలికొదిలేశారు. ఇవన్నీ లేకపోవడం వల్లే కదా సింగయ్య మరణం సంభవించింది. పోలీసులు సరైన భద్రత కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా? సింగయ్య మరణం మీద కూడా ప్రభుత్వం జిల్లా ఎస్పీతో రోజుకొక ప్రకటన చేయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.