విజయవాడ: తెలుగు దేశం పార్టీ ఉన్నాదులను ఉత్పత్తి చేస్తోందని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్, బీసీ నేత ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు చేసిన దాడికి నిరసనగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో బీసీ మహిళా ప్రజాప్రతినిధికే రక్షణ లేని స్థితిలో పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి మంచి బుద్ది ప్రసాదించాలని కోరుతూ మహాత్మా జ్యోతిరావు పూలేకు వినపతిపత్రం మహిళా నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ..`జిల్లా ప్రథమ మహిళ,బీసీ నేత ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు దాడి చేస్తే హోంమంత్రికి కనిపించలేదా? మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజన్న చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు. మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?. రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గాలు హోమ్ మంత్రి అనిత కంటికి కనిపించవా?, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం వాడుకుంటుంది’ అని వరుదు కళ్యాణి మండిపడ్డారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేసిన టీడీపీ గూండాలపై తక్షణం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ ఆమె డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ దీనిని సుమోటోగా స్వీకరించి, బీసీ మహిళా ప్రజాప్రతినిధికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, విజయవాడ నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, కృష్ణాజిల్లా, విజయవాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు విజిత, భారతి తదితరులు పాల్గొన్నారు.