కట్టె కాలే వరకు జగనన్న నాయకత్వంలో పనిచేస్తా

సీఎం వైయస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శం

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

విజయనగరం: గిరిజన ప్రాంతంలో పుట్టి గిరిజన సంక్షేమ పాఠశాలలో నేల మీద కూర్చొని చదివిన తనను గిరిజన సంక్షేమ మంత్రిని చేసి.. ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చినందుకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. కట్టె కాలే వరకు సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని భావోద్వేగానికి గురయ్యారు. జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రపంచాన్ని జయించగల ఏకైక ఆయుధం విద్య అని నెల్సన్‌మండేలా చెప్పారు. ప్రతి పేద విద్యార్థి తన చిన్ననాటి నుంచి ఉన్నతస్థాయికి వెళ్లే వరకు ఎన్నో కలలు కంటాడు. కానీ, ఉన్నత స్థాయికి వెళ్లేలోపు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటాడు. ఆర్థిక స్తోమత లేకపోవడం, సరైన పుస్తకాలు, దుస్తులు లేకపోవడం, స్కూల్‌కు వెళ్లేటప్పుడు పౌష్టికాహారం లేకపోవడం, ఇదిలా ఉంటే మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు.. ఆ తరువాత కాలేజీకి వెళ్తే తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితి.. డిగ్రీ స్టేజీలో హాస్టల్‌ ఫీజులు కట్టలేని పరిస్థితి.. డిగ్రీ పట్టాలు పట్టుకున్న తరువాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తే ఇంగ్లిష్‌ మాట్లాడడం సరిగ్గా రాక వెనుదిరిగిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఒక పేద విద్యార్థి ఎదుర్కొనే అవరోధాలు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు జరిగితే తప్ప ఆ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోలేరు. మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాదయాత్రలో నేను విన్నాను.. నేను ఉన్నానని ధైర్యం చెప్పారు. 

అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, మన బడి నాడు–నేడు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, ఇంగ్లిష్‌ మీడియం విద్య తీసుకువచ్చారు. దేశం అంటే మట్టి కాదోయి.. దేశం అంటే మనుషులోయి అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. అలాంటి మహాకవి నడయాడిన నేల మన ఉత్తరాంధ్ర.. అటువంటి ఉత్తరాంధ్రలో ఎంతో మంది ఉద్యోగాలు లేక వలస కూలీలుగా మారారు. అటువంటి మన ఉత్తరాంధ్రకు ఒట్టి మాటలు కాదు.. గట్టి మేలు చేసేలా విశాఖకు పరిపాలన రాజధాని తీసుకువచ్చి రూపురేఖలను మార్చబోతున్నారు. మహిళల రక్షణ కోసం ఒక అన్నలా, తండ్రిలా ఆలోచించి దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. పోలీసుల నెత్తిపై ఉండే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతి రూపాలు అయితే.. కనిపించని ఆ నాలుగో సింహం దిశ చట్టం. ప్రమాణస్వీకారం వేదికపై నుంచి ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని సీఎం చెప్పారు.. మంచి ముఖ్యమంత్రి కాదు.. దేశానికే ఆదర్శమైన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌'. 

Back to Top