తాడేపల్లి: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. ఆదివారం కోవిడ్-19 నివారణా చర్యలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకే అనుమతి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఇలా వస్తున్న వలసకూలీలు వేలల్లో ఉంటున్నారు. వారందర్నీ క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్నారు. అందరికీ పరీక్షలు చేస్తున్నారు. వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది. అందువల్ల మిగిలిన వారు సహకరించాలని సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్–19 విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమకరమన్నారు. ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు మీ ఇళ్లల్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యాలకు ముప్పు ఉంటుంది. ప్రజారోగ్యం కోసం ఏపీలో పెద్ద ఎత్తున కోవిడ్ –19 నివారణా చర్యలు చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చర్యలకు ప్రజల నుంచి సహకారం కొనసాగాలని ముఖ్యమంత్రి కోరారు. కోవిడ్–19పై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని సీఎం వైయస్ జగన్ కోరారు. మద్య నియంత్రణ దిశగా అడుగులు రాష్ట్రంలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని అడుగులు వేసింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. 25 శాతం మద్యం ధరలు పెంచుతోంది. రానున్నరోజుల్లో మరిన్ని దుకాణాల సంఖ్య తగ్గింపునకూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. భౌతిక దూరం పాటించేలా మద్యం విక్రయాలు చేపట్టాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.