డిగ్రీదాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుంది

వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా నగదు జమ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

జనవరి– మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్నవారికి అర్హులకు సాయం

మొత్తం 12,132 మందికి రూ.87.32 కోట్ల లబ్ధి

కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి ఉండాలని నిబంధన తీసుకొచ్చాం

కనీసం 10వ తరగతి అయినా పేద పిల్లలు చదువుకుంటారు

అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు కనీస వయసు నిర్ధారించాం

బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: డిగ్రీదాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన,వసతి దీవెన పథకాలు ఉన్నందున కనీసం డిగ్రీ వరకు చదువుకుంటారని చెప్పారు. అందుకే వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలకు కనీసం పదో తరగతి అర్హత పెట్టామన్నారు. చదువు అనే దివ్యాస్త్రంతో పేదరికం నుంచి బయటపడవచ్చు అని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు.  ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ నూతన జంటలతో వర్చువల్‌గా మాట్లాడారు.

 ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

దేవుని దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. దాదాపు 12,132 జంటలను ఏకం చేస్తూ వారికి తోడుగా ఉండేందుకు రూ.87.32 కోట్ల డబ్బును పెళ్లి కుమార్తెల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.

ఈ మంచి కార్యక్రమం కేవలం ఆర్ధికంగా ఆదుకోవడమే ఒక్కటే కాకుండా, 10వ తరగతి పిల్లలు కచ్చితంగా చదివి ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం.  అప్పుడే షాదీతోఫా, కళ్యాణమస్తులు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పాం. ఇది ఎప్పుడైతే ఎఫెక్టివ్‌గా మైండ్‌లో రిజిస్టర్‌ అవుతుందో అప్పుడు కచ్చితంగా పదోతరగతి వరకు చదివించాలన్న తపన ప్రతి ఒక్క పేదకుటుంబంలో మొదలవుతుంది. దీనికి తోడు కచ్చితంగా 18 సంవత్సరాలు వయస్సు అమ్మాయికి, 21 సంవత్సరాలు వయస్సు అబ్బాయికి ఉండాలన్న నిబంధన కూడా ఉంది.  ఏ కుటుంబం అయినా పదోతరగతి వరకు తమ పిల్లలను చదివించేసరికి 15 ఏళ్లు వయస్సు వస్తుంది. పదోతరగతి 15 ఏళ్లకు అయిపోయిన తర్వాత పెళ్లి కోసం 18 సంవత్సరాల వరకు ఆగాలి. ఎలాగూ మనం ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ మీడియట్‌ వరకూ అమ్మఒడి పథకం ఇస్తున్నాం. దీంతో పిల్లలను పదోతరగతి తర్వాత ఇంటర్‌మీడియట్‌ వరకూ చదివిస్తారు.
దీనికి అమ్మఒడి పథకం ప్రోత్సాహకంగా నిలుస్తుంది. ఇంటర్‌ తర్వాత జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుబాటులోకి వస్తుంది కాబట్టి.. పిల్లల తల్లిదండ్రులకు భారం ఉండదు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకుండా జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ  చదువుతున్న ప్రతి బాబుకు, పాపకు రూ.20వేల వరకు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కాబట్టి డిగ్రీ కూడా పూర్తి చేస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదివే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతాయి. దానికి ప్రోత్సాహకంగా నిలబడేందుకు  జగనన్న అమ్మఒడి ఒక బెంచ్‌ మార్కు కాగా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన రెండో బెంచ్‌ మార్కు అవుతుంది. వైఎస్సార్‌ షాదీతోఫా, కళ్యాణమస్తు మూడో బెంచ్‌ మార్క్‌ అవుతుంది. వీటన్నింటితో ప్రతి తల్లి తన పిల్లలను డిగ్రీ వరకు చదివించే కార్యక్రమం చేస్తారు. పేదరికం అన్నది పోవాలంటే దానికి ఒకే ఒక మార్గం చదువులు. డిగ్రీలు పాసవుతేనే వీరికి మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. అలా వస్తేనే వాళ్ల తల్లిదండ్రుల కన్నా మెరుగ్గా సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఈ కుటుంబాలన్నీ పేదరికం నుంచి బయటకు రాగలుగుతాయి.  ప్రతి అడుగు ఇదే దిశలో వేస్తున్నాం. 

ఇవాళ షాదీతోఫా కళ్యాణమస్తు పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న 12,132 మంది జంటల్లో 5,929 జంటలు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన తీసుకుంటున్నాయి. అంటే దాదాపు ఆరువేల జంటలు డిగ్రీ పూర్తి చేయడమో, డిగ్రీ చదవుతుండటమో జరుగుతుంది.  వీటన్నింటి వల్ల  ప్రతి పేద కుటుంబం నుంచి చదువుల విప్లవం రావాలని, పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను. 

ఇంతకముందు  ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. గతంలో ఎన్నికల కోసం చేస్తూ ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు చేశారు. ఆ తర్వాత పట్టించుకోకుండా పోయిన గత పరిస్థితులను మార్పు చేస్తూ... మనసుపెట్టి చిత్తశుద్ధితో ఈ పథకాన్ని రూపకల్పన చేశాం.
గత ప్రభుత్వం 17,709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టిన పరిస్థితులు చూశాం. దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టింది. ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారు.

మన ప్రభుత్వం మాత్రం మనసుపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు మంచి జరగాలని మనసా, వాచా, కర్మణా అడుగులు వేశాం. 
గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40వేలు ఇస్తే...  దాన్ని రూ. 1లక్ష చేశాం. ఎస్టీలకు రూ.50 గతంలో ఇస్తే... దాన్ని కూడా రూ.1లక్ష చేశాం. బీసీలకు రూ.35వేలు గతంలో ఇస్తే.. ఇప్పుడు రూ.50వేలు చేశాం. మైనార్టీలకు రూ.50వేలు గతంలో ఇస్తే ఇప్పుడు రూ.1లక్ష చేశాం. విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.1 లక్ష ఇస్తే.. వారికి కూడా మంచి జరగాలని దానిని రూ.1.50 లక్షలు చేశాం. వీటన్నింటిని చేస్తూ ఎందుకు చదవులుకు ముడిపెడుతున్నామంటే.. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అనే దివ్యాస్త్రం మీ అందరికీ రావాలన్న తపన తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. వీటి ద్వారా మీ కుటుంబాలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రోత్సహకాన్ని అందుకుంటున్న ప్రతి జంటకు హేపీ మేరీడ్‌ లైఫ్‌. వారి తల్లిదండ్రులకు బెస్ట్‌ విషెస్‌ అని చెబుతూ సీఎం తన ప్రసంగం ముగించారు.

 కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన యువతిని ఏం చదువుతున్నావని సీఎం ప్రశ్నించగా.. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ అని చెప్పిన యవతి. ఆమె డిగ్రీ విద్యను కొనసాగించాలని యువతి తల్లికి సూచించిన సీఎం.

Back to Top