తాడేపల్లి: ఏబీఎన్ చానల్ ప్రసారం చేసిన కథనాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు మూడు పేజీల లేఖను సమర్పించారు. ఆ లేఖలో, తమ పార్టీ నేతలను కించపరిచే విధంగా, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఏబీఎన్ కథనాలు ప్రసారం చేశారని పేర్కొన్నారు. ఇటువంటి ప్రసారాలు ప్రజాస్వామ్యానికి, మీడియా నైతిక విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అలాగే, కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టానికి విరుద్ధంగా ఆ చానల్ వ్యవహరించిందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అభ్యంతరకర ప్రసారాలు సమాజంలో అసహనాన్ని పెంచే ప్రమాదం ఉందని, మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఏబీఎన్ చానల్ చేసిన ఈ చర్య అత్యంత అనైతికమని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.