ఈనెల 21న న‌ర‌సాపురంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

పశ్చిమగోదావరి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈనెల 21న నరసాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల‌ను కలెక్టర్‌ ప్రశాంతి ప‌రిశీలించారు. చినమామాడిపల్లి వద్ద నిర్మించిన హెలీప్యాడ్‌ను, 25 వార్డు వీవర్స్‌కాలనీ వద్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదికను పరిశీలించారు. వేదిక పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. బహిరంగసభ వద్ద పార్కింగ్‌ విషయంలో ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సీఎం పర్యటన 21న ఖరారు అయ్యింది. ఆ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కావడంతో నరసాపురంలో జరిగే వేడుకల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రాజెక్ట్‌ పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాపన చేయ‌నున్నారు. అదే విధంగా బస్టాండ్, 100 ప‌డ‌క‌ల ఆసుపత్రిని సీఎం ప్రారంభిస్తారు. 

Back to Top