నేను విన్నాను..నేను ఉన్నాను అన్న మాటను నిలబెట్టుకుంటూ..

వైయస్‌ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా

థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ప్రజలందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు

జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నాం

 థర్మల్‌ ప్లాంట్‌ కోసం భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు

వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు

326 కుటుంబాలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం

రెండో దశలో 150 కుటుంబాలకు నవంబర్‌లో ఉద్యోగాలు

16,218 మత్స్యకారేత కుటుంబాలకు రూ.34.74 కోట్ల సాయం

రూ. 25 కోట్లతో ఫిషింగ్‌ జెట్టికి శంకుస్థాపన చేసిన సీఎం వైయస్‌ జగన్‌ 

నేలటూరు: పాదయాత్రలో..ఎన్నికల సమయంలో మీ కష్టాలు చూసిన తరువాత నేను విన్నాను..నేను ఉన్నానని ఆ రోజు చెప్పిన మాటను నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.  నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఫిషింగ్‌ జెట్టికి సీఎం వైయ‌స్ జగన్‌ శంకుస్థాపన చేశారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. 

రాష్ట్ర విద్యుత్‌ రంగంలో మరో ముందడుగు....
ఈరోజు రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు వేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ఏపీ జెన్‌కో స్వయంగా నిర్మించిన శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్ల ప్లాంటును ఈ రోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నాం. 

ప్రియతమ నేత వైయస్సార్‌ హయాంలో...
ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు(నాన్నగారు) 2008లో శంకుస్ధాపన చేశారు. ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలిదళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నాం. దేశంలో తొలిసారి ప్రభుత్వం రంగంలో సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌స్టేషన్‌ నిర్మాణానికి మహానేత రాజశేఖరరెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఆయన చొరవతో నేడు మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఆ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను పూర్తి సామర్ధ్యంతో ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను.

నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ కోసం...
రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు రూ.3200 కోట్లు యుద్ధప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. 
రాష్ట్ర విద్యుత్‌ అవసరాలలో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్ధలు ఉత్పత్తి చేస్తున్నాయి.  
ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకి 19 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఏపీ గ్రిడ్‌కు ఇక్కడ నుంచి సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుతో పోల్చితే సూపర్‌ క్రిటికల్‌ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుంది.

భూములిచ్చిన రైతులకు నిండుమనస్సుతో అభివాదం...
ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్‌ పవర్‌ ప్లాంటు... ఈ రెండూ ఈప్రాంతంలో రావాలి. వీటి ద్వారా జిల్లా అభివృద్ధి చెందాలని.... ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ కూడా నిండు మనస్సుతో...శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నాను. వీళ్లందరికీ మంచి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ కూడా ఈ నవంబరు పూర్తయ్యేలోగా అడుగులు వేయమని ఆదేశాలు ఇచ్చాం. 

నెరవేరిన మరో ఎన్నికల హామీ....
ఇక్కడకి రావడానికి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒక కారణం అయితే... మరో కారణం.. ఎన్నికల వేల ఆరోజు మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఇక్కడకి వచ్చాను. ఆ రోజు మీరంతా చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడు గారికి మేమంతా గుర్తుకు వస్తాం. ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా, హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఆ రోజు నేను మీ అందరికీ  నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పాను. ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలు అందరికీ కూడా బటన్‌ నొక్కి నేరుగా రూ.36 కోట్లు వాళ్ల బ్యాంక్‌ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేస్తున్నాం.

ఆవేళ హడావుడిగా కేవలం మోసం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వని పరిస్థితులు. ఈ రోజు వాళ్లకి మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా మిగిలిపోయిన ఆ 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ... మొత్తం అందరికీ కూడా ఈ ప్యాకేజీ ఇస్తున్నాం.

మరో ముఖ్యవిషయం కూడా ఈ వేదిక నుంచే ప్రకటిస్తున్నాను. ఇదే నెల్లూరు జిల్లాలో పెన్నానది పై ముదివర్తి, ముదివర్తిపాలెం మధ్య సబ్‌మెర్జబుల్‌ కాజ్‌వే నిర్మాణం కోసం రూ.93 కోట్ల కేటాయిస్తూ.. దానికి కూడా ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం. నా సోదరుడు, శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అడిగిన మీదట ఈ కాజ్‌వే నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాను. అదే విధంగా ఈ మధ్య కాలంలో నెల్లూరు బ్యారేజ్‌ను ప్రారంభించాం. దానికి కూడా నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును ఆ బ్యారేజ్‌కు ప్రకటిస్తున్నాం.
ఇంతకముందు నేను చెప్పినట్టుగా ఈ సబ్‌మెర్జబుల్‌ చెక్‌డ్యాం కోసం కేవలం రూ.93 కోట్లు ఖర్చవుతుంది. ఇటువంటి ప్రాజెక్టు కోసం దశాబ్ధాలుగా అడుగుతున్నా పట్టించుకోని పాలకులను మనం చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రంలోకి పోయే  వాటర్‌ను ఆపగలుగుతాం. సముద్రం నుంచి వచ్చే బ్యాక్‌ వాటర్‌ను ఆపగలుగుతాం. తద్వారా నాలుగు మండలాలకు నీటి సమస్యపరిష్కారం అవుతుంది. ఆ ప్రాజెక్టుకు కూడా శంకుస్ధాపన చేస్తున్నాం.

కాసేపటి క్రిందట ఇక్కడే మరో ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేసాం. 
ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ప్రత్యేక జట్టీ ఇస్తూ.. రూ.25 కోట్లతో దానికి కూడా శంకుస్ధాపన చేశాం.
ప్రతి ఒక్కరికీ మంచి చేస్తూ అడుగులు వేగంగా వేస్తున్న మనందరి ప్రభుత్వానికి, ప్రతి ఇంటికి మంచి చేయాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మన ప్రభుత్వానికి, ప్రతి గ్రామంలో కూడా రూపురేఖలు మార్చాలని తాపత్రయంతో అడగులు వేస్తున్న మన ప్రభుత్వానికి... దేవుడి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.

 కాసేపటి క్రిందట మంత్రి కాకాణి గోవర్ధన్‌ మాట్లాడుతూ... ఉప్పుకాలువ, వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాలెం హైలెవల్‌ బ్రిడ్జి కోసం రూ.12 కోట్లు అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాం.  మరో హైలెవల్‌ బ్రిడ్జి కోసం ... నెల్లూరు నక్కలవాగు.... కృష్టపట్నం రోడ్డు నుంచి పోటంపాడు వయా బ్రహ్మదేవం వరకు మరో రూ.10 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను చెబుతూ... సీఎం తన ప్రసంగం ముగించారు.

 

Back to Top