స‌మ‌గ్ర భూస‌ర్వేతో ప్ర‌జ‌ల‌కు, రాష్ట్రానికి మేలు

`శాశ్వత భూ హక్కు - భూ రక్ష`తో భూవివాదాలు ప‌రిష్కారం

సిబ్బంది, సాంకేతిక ప‌రికరాలు స‌మ‌కూర్చ‌డంలో వేగం పెంచండి

భూ స‌మ‌గ్ర స‌ర్వే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త‌ భూహ‌క్కు-భూర‌క్ష ప‌థ‌కంపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వంద సంవ‌త్స‌రాల త‌రువాత రాష్ట్రంలో స‌మ‌గ్ర భూస‌ర్వే జ‌రుగుతోంద‌ని, ఈ సర్వేను పూర్తిచేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సమగ్ర సర్వే వివరాలను అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. సమగ్ర సర్వేతో అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయ‌న్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంద‌న్నారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని చెప్పారు. సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలని సూచించారు. డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవడం.. ఇలా ప్రతి అంశంలోనూ వేగం పెంచాల‌న్నారు. భూస‌మ‌గ్ర సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల‌ని ఆదేశించారు.  

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు  కార్యాల‌యంలో జ‌రిగిన ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయడు, అటవీ పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్ జి. సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్, ఇతర ఉన్నతాధికారు హాజ‌ర‌య్యారు. 

Back to Top