అంగన్‌వాడీల‌పై నిరంత‌ర పర్యవేక్షణ ఉండాలి

63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గ్రీన్‌ సిగ్నల్

స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ప‌దోన్న‌తుల‌కు సీఎం ఆదేశం 

పాలు, గుడ్లు లాంటి పౌష్టికాహార‌ పంపిణీలో సమస్యలు ఉండకూడదు

పిల్లలకు ఫ్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలి

రూ.1500 కోట్లతో అంగ‌న్ వాడీల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మం  

పనుల్లో నాణ్యత ఉండాలి, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలి

అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన

మహిళా శిశు సంక్షేమశాఖపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష

తాడేప‌ల్లి: అంగన్‌వాడీల‌పై నిరంత‌రం పర్యవేక్షణ ఉండాలని, పాలు, గుడ్లు లాంటి పౌష్టికాహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని, సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలని సంబంధిత శాఖ అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. అంగన్‌వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాల‌ని సూచించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. సంబంధిత మంత్రి, ఉన్న‌తాధికారుల‌కు ప‌లు కీల‌క అంశాల‌పై మార్గ‌నిర్దేశం చేశారు. 

అంగన్‌వాడీలలో నాడు – నేడుపై సమీక్ష
`అంగ‌న్ వాడీల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తోంది. మూడు విడతల్లో ప‌నులు చేప‌ట్టాలి. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలి. పనుల్లో నాణ్యత ఉండాలి, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలి. ప్రతి మండలంలో కూడా పనులు జరిగేలా మూడు విడతలకూ కార్యాచరణ చేయాలి` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

`అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. సమగ్రమైన ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలి. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలి. సూపర్‌వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలి` అని సీఎం ఆదేశించారు. 

`నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలి. అలాగే పిల్లలకు ఫ్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్‌  రూపొందించుకోవాలి` అని ఆదేశించారు. 

`అంగన్‌వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాలి. అంగన్వాడీలలో స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలి. అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాలి. వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలి. తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలి. ఈ విషయంలో అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్,  వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, అందరితోపాటు ఇచ్చే మందులు కాకుండా.. అదనంగా ఇస్తూ.. వీరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలి. ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో దీనికి పరిష్కారం చూపించాలి` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.  

తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానం పై ఆలోచన చేయాలి. దీనికోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలి. అంగన్‌వాడీలలోను, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వారి పట్ల సానుకూల దృక్ప‌థంతో పనిచేయాలి. 10–12  ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టింద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. 

ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కే వి ఉషశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీడెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎ బాబు, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జీ వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, మార్క్‌ ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top