ఓటీఎస్‌ స్కీమ్‌.. ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’గా నామ‌క‌ర‌ణం

వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న అధికారులు

సెప్టెంబర్‌ 25 నుంచి ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో డేటా అప్‌లోడ్‌

తాడేపల్లి: వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు ముఖ్య కేంద్రాలుగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా అధికారులు పేరు ఖరారు చేశారు. పథకం అమలుకోసం రూపొందించిన విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. 

సెప్టెంబరు 25 నుంచి ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో డేటాను అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ డేటాను వివిధ సచివాలయాలకు పంపించనున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం సొమ్మును చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హులైన వారి జాబితాలు ప్రదర్శించనున్నారు. ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంకు మంచి స్పందన వస్తోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని సీఎం సూచించారు. 

పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష
ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్‌ అయినట్టు తెలిపారు.  

ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లేఅవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయని అధికారులు వివరించారు.  మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్షించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధంచేశామని అధికారులు వివరించారు. కాలనీ ఒక యూనిట్‌గా పనులు అప్పగించాలని సీఎం సూచించారు. అదే విధంగా టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్షించారు. 

ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌ పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ ఎన్‌ భరత్‌ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

తాజా వీడియోలు

Back to Top