త్వరలో రచ్చబండ కార్యక్రమం

వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం

జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో ఏపీలో రచ్చబండ కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు సీఎం వెల్లడించారు. రచ్చబండ కార్యక్రమంపై శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.  వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా  ప్రజల నుంచే వచ్చే వినతులపైన హామీలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలన్నారు. మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి, ఎలాంటి తాత్సారం చేయకూడదని ఆదేశించారు.  ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చినమాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదని చెప్పారు. విశ్వసనీయత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదన్నారు.  దీనికోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలని సూచించారు. వచ్చే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా నేను ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావడం అన్నదే ఒక మైలు రాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే ఇది జరుగుతుందన్నారు. మేనిఫెస్టోను అమలు చేయగలిగితే.. ప్రజలకు మేలు చేసినట్టే అన్నారు. 

ప్రభుత్వం ఏం చేసినా సంతృప్త స్థాయిలో ఉండాలి..
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొన్నారు.  గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టిందని చెప్పారు.  ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టిపెట్టామని తెలిపారు. అనవసర వ్యయాన్ని తగ్గించడానికి అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. అలాగే ప్రాధాన్య అంశాలపై దృష్టిపెట్టాలని, ఫోకస్‌గా ముందుకు వెళ్లాలని ఆదేశించారు . ఫోకస్‌ లేకపోతే ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా సంతృప్త స్థాయిలో చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని చెప్పారు.  సంతృప్తస్థాయిలో అమలు చేయడమే ప్రతి పథకానికీ ప్రమాణమని పేర్కొన్నారు.  నిధులను అక్కడ కొంత, ఇక్కడ కొంత ఖర్చు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదని చెప్పారు. నవరత్నాల అమలే ఈ ప్రభుత్వానికున్న ముఖ్య ఉద్దేశమన్నారు. మేనిఫెస్టో అందరి వద్ద ఉండాలని అధికారులను ఆదేశించారు. మేనిఫెస్టో ద్వారా ప్రాధాన్యతలేంటో చెప్పాలని తెలిపారు. 14 నెలలపాటు 3648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించి, అధ్యయనం చేసి ఈ మేనిఫెస్టోను తయారుచేశామని స్పష్టం చేశారు. ఏసీ గదుల్లో ఉండి తయారు చేసింది కాదని వెల్లడించారు. ప్రతి హామీ కూడా ప్రజల వినతుల నుంచి, క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితులనుంచి, వెనకబడ్డ వర్గాల వేదన నుంచే వచ్చిందని చెప్పారు.  సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలమో ఆలోచనలు చేయాలని సూచించారు. ఢిల్లీలో ఉన్న మన అధికారులను బాగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధుల్ని తెచ్చుకోవాలన్నారు.  ముఖ్యమంత్రిగా నేను ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుతమిచ్చే హామీనే అని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనల సందర్భంగా నేను ఇచ్చే హామీల అమలుపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.  

Read Also: భజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది

 
 

Back to Top