14,200 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌ మెంట్‌

సిబ్బంది కొరతలేని ప్రభుత్వాసుపత్రి దిశగా పటిష్ట చర్యలు

అక్టోబరు నుంచి ప్రక్రియ ప్రారంభం.. నవంబర్‌ 15 నాటికి ముగింపు

ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి

తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో వ్యాక్సినేష‌న్ ప్రత్యేక డ్రైవ్ చేప‌ట్టాలి

నూత‌న‌ బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,200కుపైగా పోస్టులను భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖపై సీఎం  వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖపై ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించారు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో సిబ్బంది కొరతలేకుండా నియామకాలపై ప్రధానంగా చర్చించారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్‌ ఏమన్నారంటే..

``ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్యంకోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. కావాల్సిన సిబ్బంది వెంటనే నియమించాలి`` అని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.

తోటి డాక్ట‌ర్ల‌పై భారం ప‌డ‌కూడ‌దు..
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి. ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా.. దీనికి తగిన సంఖ్యలో వైద్యులను నియమించండి. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితి కాని, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కాని ఉండకూడద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. 

కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాలి..
వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు ముఖ్య‌మంత్రి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,200కుపైగా పోస్టులు అవ‌స‌ర‌మ‌ని అధికారులు వివ‌రించ‌గా.. అధికారుల ప్ర‌తిపాద‌న‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. 

రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 98.60 శాతం
కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రాలందించారు. రాష్ట్రంలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 13,749 ఉన్నాయ‌ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2787 మంది ఉన్నార‌ని, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 562 చికిత్స‌పొందుతున్నార‌ని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతం, పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉంద‌ని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.

``3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 10 
3 నుంచి 5 శాతం లోపు పాజిటివిటీ ఉన్న జిల్లా 2
ఐదు శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న జిల్లా 1
రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు 10,921
నెట్‌ వర్క్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 91.33 శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 72.64 శాతం`` అని అధికారులు తెలిపారు.

థర్డ్‌ వేవ్‌ పై సన్నద్ధత
అందుబాటులో ఉన్న డీటైప్‌ సిలెండర్లు  27,311
మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ 20,964
ఇంకా రావాల్సినవి 2493
128 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఫైప్‌లైన్‌ వర్క్‌ పూర్తి
ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 143 చోట్ల ఏర్పాటు 
అక్టోబరు 10 నాటికి అందుబాటులోకి రానున్న మొత్తం ప్లాంట్లు 

వ్యాక్సినేషన్‌
ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌  చేయించుకున్నవారి సంఖ్య  2,61,56,928
సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,34,96,579
రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్నవారు 1,26,60,349
వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు  3,88,17,277
 
రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా అమలు
కోవిడ్‌ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో వ్యాకినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాల‌ని ఆదేశించారు. ఈ మూడు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం ప్రత్యేక అధికారులను నియమించాల‌న్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌కు సంబంధించి గైడ్‌లైన్స్‌ పై అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలన్నారు. పాజిటివిటీ రేటు ఎక్కుగా ఉన్న జిల్లాల్లో అంక్షలు కొనసాగించాల‌ని ఆదేశించారు. కోవిడ్‌ నిబంధనలును కచ్చితంగా, కఠినంగా అమలు చేయాల‌ని సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియే కోవిడ్‌ సమస్యకు పరిష్కారమన్నారు. దీన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని),ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారు గోవిందహరి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top