వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృృష్టి పెట్టాలి 

క‌రోనాపై ఉన్న‌తాధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష 

అమరావతి : క‌రోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృృష్టి పెట్టాలని, 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్లు సత్వరమే అందించాలని సీఎం వైయ‌స్ జగన్‌ అధికారులకు ఆదేశించారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడం కన్నా... ఆ వైరస్ ‌రాకుండా నివారణా పద్ధతులపై దృష్టిపెట్టాలని తెలిపారు.  కరోనాపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ అడ్డు..

 'వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అడ్డుగా మారింది. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయింది. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవి కూడా జరిగిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు, జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చు. లేకపోతే వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం..ఇవన్నీకూడా కష్టం అవుతాయి.

గ‌వ‌ర్న‌ర్‌, హైకోర్టుకు నివేదించాలి..
 మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అధికారులు ప్రయత్నించాలి. ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలి' అని సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. 

క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య పెంచాలి..
కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

Back to Top