లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశానికి నాంది పలుకుతున్నాం..

రామాయపట్నం పోర్టు భూమిపూజ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది

పోర్టు రావడం వల్ల ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది

రూ.3740 కోట్లతో రామాయపట్నం పోర్టును నిర్మిస్తున్నాం

9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 పోర్టుల పనులు వేగవంతం చేశాం

రెండు నెలల్లో మిగిలిన పోర్టులకు కూడా భూమిపూజ చేస్తాం

ఫిషింగ్‌ హార్బర్ల ద్వారా లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి

75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తెచ్చిన ప్రభుత్వం మనది

పోర్టు రావడానికి సహకరించి గ్రామ ప్రజలు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు

మరో దశాబ్దకాలంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి

ఎన్నికలకు రెండు నెలల ముందు భూసేకరణ, డీపీఆర్‌ లేకుండా చంద్రబాబు శంకుస్థాపన

పోర్టు శంకుస్థాపన పేరుతో ఈ ప్రాంత ప్రజలను చంద్రబాబు మోసం చేశారు

నెల్లూరు: రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోర్టు వల్ల ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుందని, ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని, రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. దీని వల్ల రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ప్రత్యక్షంగా 4 వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పోర్టు రావడానికి సహకరించిన గ్రామాల ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ పేరు పేరునా కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులు కాకుండా మరో నాలుగు పోర్టులు తేబోతున్నామని, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు. రెండునెలల్లో మిగతా వాటికి భూమి పూజ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 

రామాయపట్నం పోర్టు భూమిపూజ, శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

‘‘మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రామాయపట్నం పోర్టుకు భూమిపూజ చేశాం. ఒక పోర్టు రావడం, ఆ పోర్టు వల్ల జరిగే మంచి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చెన్నై, విశాఖపట్నం, ముంబై ఇలా ఏ నగరం అయినా మహా పెద్ద నగరంగా ఎదగాలంటే పోర్టు ఉండటం.. దేవుడే ఇచ్చి వరంగా  భావించొచ్చు. ఈ పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు..  చాలా పెరిగే పరిస్థితులు వస్తాయి. పోర్టురావడం వల్ల ఎకనామిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది. పోర్టు రావడం ల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చులు  బాగా తగ్గిపోతాయి. నీటి ద్వారా ట్రాన్స్‌పోర్టు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తద్వారా రాష్ట్రానికి, ఈ ప్రాంత రూపురేఖలు మారే పరిస్థితులు ఉంటాయి. 

ఎలాగూ మన రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకువచ్చాం. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏకంగా చట్టం తీసుకువచ్చాం. ఈ చట్టం ఆధారంగా.. కచ్చితంగా పోర్టులు, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వకతప్పని పరిస్థితి. ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి.. ఈ రాష్ట్రానికి పెద్ద ఊతం వస్తుంది. 

రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటని గమనిస్తే.. రాష్ట్రంలో దాదాపుగా ఆరు పోర్టులు ఉన్నాయి. కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు ఉన్నాయి. విశాఖ మినహా మిగిలిన వాటి ద్వారా 158 మిలియన్‌ టన్నుల కెపాసిటీ ఉంటే.. విశాఖ ద్వారా 70 మిలియన్‌ టన్నుల కెపాసిటీ యాడ్‌ అవుతుంది. ఈ ఆరు పోర్టులకు మరో నాలుగు పోర్టులను యాడ్‌ చేస్తున్నాం. బావనపాడు, కాకినాడ గేట్‌ వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు..  ఇలా మరో నాలుగు పోర్టులు యాడ్‌ అవుతున్నాయి. వీటి ద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల కెపాసిటీ బిల్డింగ్‌ జరుగుతుంది. 

నాలుగు పోర్టులు యాడ్‌ చేయడమే కాకుండా.. రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్ప, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నం, జువ్వెలదిన్న ఫిషింగ్‌ హార్బర్లు, నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలోనే మరో రెండు నెలలు తిరక్కముందే మిగిలిన పోర్టులకు భూమిపూజ చేస్తాం. 

తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, నాలుగు పోర్టులు, ప్రస్తుతం ఉన్న 6 పోర్టులు. ప్రతి 50 కిలోమీటర్లకు ఫిషింగ్‌ హార్బర్‌ కానీ, పోర్టు కానీ కనిపించే పరిస్థితికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 9 ఫిషింగ్‌ హార్బర్లు పూర్తయిపోతే.. అక్షరాల లక్ష మంది మత్స్యకార కుటుంబాలకు పూర్తిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నాలుగు పోర్టుల ద్వారా ప్రత్యక్ష ఉపాధి 4 వేల మందికి, పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తుంది. పోర్టులకు తోడు ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కూడా జరుగుతుంది. మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశానికి నాంది పలుకుతున్నాం. 

రామాయపట్నం గురించి మాట్లాడాలంటే..
2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి.. అప్పటి పాలకులు అందరికీ గుర్తుండే ఉంటుంది.. చంద్రబాబు 2019ఫిబ్రవరిలో వచ్చి శంకుస్థాపన అన్నాడు. డీపీఆర్, భూసేకరణ జరగకుండా ప్రజలను మోసం చేయడానికి 2019 ఫిబ్రవరిలో వచ్చి శంకుస్థాపనకు ఒక టెంకాయ కొట్టాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడం కోసం డీపీఆర్, స్థల సేకరణ లేకుండా ఏకంగా టెంకాయ కొట్టి శంకుస్థాపన అంటే అంతకంటే మోసం, అన్యాయం ఎక్కడైనా ఉంటుందా..? గత పాలనలో మనమంతా చూశాం. రుణమాఫీ అంటూ రైతులను, అక్కచెల్లెమ్మలకు మోసం, ఉద్యోగాలంటూ చదువుకునే పిల్లలకు మోసాలు. చివరకు ప్రాంతాల దగ్గరకొచ్చే సరికి చిన్న  చిన్న మోసాలు ఏ స్థాయిలో జరిగాయో ఒక్కసారి గమనించండి. 

ఈరోజు 850 ఎకరాల భూమి సేకరించి.. రూ.3740 కోట్లతో పనులు కూడా ఈరోజు మొదలు పెట్టాం. రామాయపట్నం పోర్టు ద్వారా 4 బెర్త్‌లు అందుబాటులోకి వస్తాయి. ఈ పోర్టులో మరో 6 బెర్త్‌లు కూడా ఇదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 6బెర్త్‌లకు కూడా కేవలం ఒక్కో బెర్త్‌కు రూ.200 కోట్లు పెడితే మిగిలిన బెర్త్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. నాలుగు బెర్త్‌ల ద్వారా 25 మిలియన్‌ టన్నుల కార్గో.. ఒక్కో బెర్త్‌కు రూ.200 కోట్లు పెట్టుకుంటూ యాడ్‌ చేసుకుంటూ వెళ్తే ఏకంగా 50 మిలియన్‌ టన్నుల వరకు కార్గో కూడా ఇక్కడ ఫెసిలిటేట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈపోర్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. ఈ ప్రాంతంలో పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలు.. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం ఇవే కాకుండా పంచాయతీలు రావూరు, చేవూరు, సాలిపేట గ్రామస్తులందరికీ నిండు మనసుతో పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భూములు ఇచ్చి పోర్టు రావడానికి అడుగులు వేస్తున్నారో.. అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఈ ప్రాంత రూపురేఖలు రాబోయే దశాబ్దకాలంలో మారిపోతాయి. మన పిల్లలు ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా.. వర్క్‌ టు హోమ్‌ పరిస్థితి ఏర్పడుతుంది. 

పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామిక కారిడార్‌ వస్తేనే ఇంకా ఎక్కువ అభివృద్ధి, ఎక్కువగా పోర్టును ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి.. పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తారని, కావలి నియోజకవర్గానికి సంబంధించి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నాయి.. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌ అన్న అడిగినట్టుగా రాబోయే రోజుల్లో అడుగులు ముందుకువస్తాం. 

మహీధర్‌రెడ్డి కొన్ని విషయాలు అడిగాడు.. కావలికి సంబంధించి బైపాస్‌ రోడ్డు 6.2 కిలోమీటర్ల భూసేకరణ కావాలని అడిగాడు. పోర్టు వచ్చి వాతావరణం మారిపోతున్నప్పుడు కందుకూరు టౌన్‌ పెద్ద హబ్‌గా తయారవుతుంది. మహీధర్‌రెడ్డి అడిగిన రోడ్డు భూసేకరణకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. కందుకూరు మున్సిపాలిటీలో డెవలప్‌మెంట్‌కు సంబంధించి సహాయ, సహకారాలు కావాలని అడిగాడు.. దానికి నేను మహీధర్‌ అన్నకు హామీ ఇస్తున్నా.. నా వంతు సహాయ, సహకారాలు అందిస్తాను. రాళ్లపాడు లెఫ్ట్‌ కెనాల్‌ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించి 8,500 ఎకరాలకు మంచి జరిగించేందుకు మరో రూ.27 కోట్లు మంజూరు చేస్తున్నాం.  ఉల్వపాడు మండలం కారేడులో ఒక పీహెచ్‌సీ భవనం మంజూరు చేస్తున్నాం. రామాయపట్నం పోర్టుతో ఈ ప్రాంత రూపురేఖలు మారే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఇంకా మంచి చేసే  అవకాశం నాకిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్టుకు సహకరించేందుకు బ్యాంకులు ముందుకువచ్చి లోన్‌లు ఇచ్చినందుకు ఎస్‌బీఐ,యూనియన్‌ బ్యాంక్‌లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top