కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి రైతుల పక్షాన నిలిచారు. దేవనకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, మిరప, వేరుశెనగ, కందులు, టమోటా, ఉల్లిగడ్డ వంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయని, రైతులు భారీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేకపోతుందని, వెంటనే రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత బీమా అందించేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది రైతులను మోసం చేయడమే” అని మండిపడ్డారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం, మండల కార్యవర్గ సభ్యులు, వైస్ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కో-కన్వీనర్, రైతులు పాల్గొన్నారు.