వైయ‌స్ఆర్‌సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్‌ పార్థీవదేహానికి సీఎం వైయ‌స్ జగన్‌ నివాళులు

కృష్ణా జిల్లా: పెడన మండలం కూడూరులో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్‌ పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.. అనంతరం కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.
 

కృష్ణాజిల్లాకు చెందిన ఉప్పాల రాంప్రసాద్‌ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. పెడన మండలం కూడూరుకు చెందిన రాంప్రసాద్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా పనిచేశారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. పెడన నియోజకవర్గంలో సీనియర్‌ రాజకీయ నాయకుడిగా టీడీపీ, వైయ‌స్ఆర్‌సీపీల్లో పదవులు నిర్వహించి ఆయన పెడన మండలంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

గతంలో టీడీపీ లీడర్‌గా ఉన్న ఆయన వైయ‌స్ఆర్‌సీపీ  ఆవిర్భావం సందర్భంగా  పార్టీ చేరి పెడన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన అంకిత భావానికి, సేవలకు మెచ్చిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 2014లో కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒటమి పాలయ్యారు. అనంతరం పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా సీఎం జగన్‌ రాంప్రసాద్‌ కోడలు ఉప్పాల హారికను కృష్ణాజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. రాంప్రసాద్‌ అకాల మరణం పెడన నియోజకవర్గానికి తీరని లోటని పలువురు పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.

Back to Top