పారదర్శకత కోసమే కంపెనీల చట్ట సవరణ... 

వైయ‌స్ఆర్‌సీపీ రాజ్య‌స‌భ‌ సభ్యులు  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు  కేంద్ర మంత్రి జ‌వాబు 

న్యూఢిల్లీ : కంపెనీలు ప్రకటించే ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లలో మరింత పారదర్శకత తీసుకు వచ్చేందుకే కంపెనీల చట్టంలోని షెడ్యూలు 3ను సవరించినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ రాజ్యసభకు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ రాజ్య‌స‌భ‌ సభ్యులు  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కంపెనీలు ఏటా ప్రకటించే ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లలో క్రిప్టో కరెన్సీ, వర్చువల్‌ కరెన్సీ లావాదేవీలు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాల కింద ఆయా కంపెనీలు చేస్తున్న ఖర్చుల వివరాలను వెల్లడించేందుకు వీలుగా కంపెనీల చట్టంలోని షెడ్యూలు 3ను సవరించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సవరణ ద్వారా ప్రతి కంపెనీ ఆ ఆర్థిక సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్‌ కరెన్సీ ద్వారా నిర్వహించిన లావాదేవీలు, వాటిలో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌లో విధిగా వెల్లడించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల కోసం చేస్తున్న ఖర్చు, వాటి స్వభావం, సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల కోసం వెచ్చించే మొత్తంలో తరుగుదల వస్తే వాటి వివరాలు ఆయా కంపెనీలు తమ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లలో పొందుపరచాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.

 దేశంలో 48 కోట్ల మందికి కోవిడ్‌ టెస్ట్‌లు 
  కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ఈనెల 1వ తేదీ వరకు దేశంలో 48 కోట్ల మందికి కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించినట్లు ఆరోగ్యస కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఈ టెస్ట్‌ల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్‌ ఆమోదం పొందిన 2838 టెస్టింగ్‌ లేబొరేటరీలను వినియోగించినట్లు ఆమె చెప్పారు. ఇందులో 1742 ఆర్టీ-పీసీఆర్‌ లాబ్‌లు, 946 ట్రూనాట్‌ లాబ్‌లు, 131 సీబీనాట్‌ లాబ్‌లు, 19 ఇతర మాలిక్యులర్‌ న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టింగ్‌ వేదికలు ఉన్నట్లు తెలిపారు.
ఆర్‌టీ-పీసీఆర్‌ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 495 ఆర్టీ-పీసీఆర్‌ యంత్రాలు, 225 ఆర్‌ఎన్‌ఏ ఆటోమేటెడ్‌ ఎక్స్‌ట్రాక్టర్లను కేంద్ర ప్రభుత్వం అందచేసినట్లు మంత్రి చెప్పారు. టీబీ పరీక్షల కోసం దేశీయంగా వినియోగించే ట్రూనాట్‌ మెషీన్లను కోవిడ్‌ టెస్టింగ్‌ కోసం వినియోగించడం జరిగింది. అలాగే టీబీ పరీక్షల కోసం వినియోగించే జీన్‌ ఎక్స్‌పర్ట్‌ యంత్రాలను కూడా కోవిడ్‌ టెస్టింగ్‌ కోసం వాడటం జరిగింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సర్టిఫికేషన్‌ పొందడానికి విధిగా దేశంలోని అన్ని మెడికల్‌ కాలేజీలు మాలిక్యులర్‌ వైరాలజీ వ్యవస్థ కలిగి ఉండాలని ఆదేశిస్తూ గత జూన్‌లో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలలో కోవిడ్‌ పరీక్షల నిర్వహణ సదుపాయం కల్పించినట్లయిందని ఆమె చెప్పారు.
ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలతో పోలిస్తే రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ల ఫలితాలలో కచ్చితత్వం తక్కువగా ఉంటున్నందున కోవిడ్‌ లక్షణాలు కలిగి ఉండి రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చిన వ్యక్తులు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలని ఐసీఎంఆర్‌ సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. 

Back to Top