అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నబిల్లులు, అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్ కమిటీ సిఫార్సుపై ప్రజెంటేషన్ ఉంటుంది. కాగా రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ, ఇటీవల జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ నివేదికలు ఇచ్చిన విషయం విదితమే. ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్తోనూ సమావేశమై.. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను వివరించింది. ఈ మేరకు 130 పేజీల సమగ్ర నివేదిక ఇచ్చింది. ఇదే విషయమై క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ సభ్యులందరికీ హై పవర్ కమిటీ.. ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీలో అజెండా ఖరారు కానుంది. ఇక ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ జరగనుంది.