ఈ–సేవల విస్తరణలో ఏపీ ప్ర‌భుత్వం ముంద‌డుగు

వాట్సాప్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

 అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను త్వరితగతిన ప్రజలకు చేరవేసే విధంగా వాట్సాప్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ–సేవల విస్తరణలో భాగంగా వాట్సప్‌ చాట్‌బోట్‌ సేవలను కూడా అందించనున్నట్లు ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ (ఏపీడీసీ) తెలియజేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగతిశీల అజెండాను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చేర వేసేలా వాట్సాప్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఏపీడీసీ వైస్‌ చైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో ఈ–గవర్నెన్స్‌ మరింత మెరుగు పరిచే విధంగా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వాట్సాప్‌ ఇండియా పబ్లిక్‌పాలసీ అధిపతి శివనాథ్‌ ఠుక్రాల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా వాట్సాప్‌ సేవలు ఉపయోగపడతాయన్నారు.

Back to Top