ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ తో ఉద్యోగ సంఘాల భేటి

 
తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు సీఎం అండగా ఉంటానని స్పష్టం చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:
– ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం.
– ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములు.
–  ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది.
– మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. 

– అందుకే పెన్షన్స్‌ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డాం:
– గతంలో ఎవ్వరూ కూడా ఒక పరిష్కారం కోసం ఇంత తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు.
– ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
– దీన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీసుకువచ్చాం. 
– రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం.
–బేసిక్‌ జీతంలో 50 శాతం అంటే రూ.1లక్ష జీతం ఉంటే రూ.50 వేలు రిటైర్‌ అయిన తర్వాత వస్తుంది.
– 62 ఏళ్లకు రిటైర్‌ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. 

– అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం.
– ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలి.
– సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. దీనికోసం రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది.
– దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశాం. 
న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు మంచి జరగాలని ప్రతి అడుగులో కనిపించే విధంగా చేశాం. ఇది సంతృప్తినిచ్చే అంశం.
- అసలు చాలామంది ఎఫర్ట్‌ కూడా పెట్టరు.
– ఇంత ఆలోచన చేయాల్సిన పని ఏముందని అనుకుంటారు. అలా చేస్తే పరిష్కారం రాదు. తొలిసారిగా ఓ పరిష్కారం దిశగా తీసుకెళ్లే కార్యక్రమం చేశాం.

కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశాం.
– సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నాం.
– వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం.
– నా దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు పదేళ్లను విండోగా నిర్ణయించారు. మరీ ఆలస్యమవుతుందని ఐదేళ్లకు తగ్గించాం. గరిష్టంగా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం.

– అలాగే వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం.
010 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుకు వచ్చినట్లుగా వీరికి జీతాలు సమయానికి రావు. పోస్ట్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌లో కూడా వ్యత్యాసం ఉంది. 
– వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. వీటన్నింటిపైనా ధ్యాసపెట్టి మనస్ఫూర్తిగా మంచి జరగాలని చేశాం.
– ఇంకా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా, మీ మొహంలో కూడా చిరునవ్వు ఉండేటట్టు చేస్తాం. 
– మీరు బాగుంటే ప్రజలకూ మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం సంతోషకరం: బండి శ్రీనివాసరావు
 12వ పీఆర్‌సీ ప్రకటించిన సీఎం వైయ‌స్‌ జగన్‌కు కృతజ్ఞతలు. ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను ప్రకటించారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగస్వామ్యమేనన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం సంతోషకరం. చాలావరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించార‌ని బండి శ్రీనివాసరావు అన్నారు. 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించినందుకు ధన్యవాదాలు. ‍కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామ‌ని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సీఎం వైయ‌స్ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతం:  శివారెడ్డి
ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్‌సీ కమిషన్‌ వేసినందుకు సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  టీడీపీ హయాంలో పీఆర్‌సీ కమిషన్‌ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఇచ్చిన మాటలను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ నిర్ణయంతో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ వచ్చినట్టే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం వైయ‌స్ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవ‌ని శివారెడ్డి అన్నారు.

 

Back to Top