తాడేపల్లి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మరోసారి లేఖ రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఆపరేషన్ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తోందని, కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ కోరారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా సీఐఎస్ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్టును తేవాలని, విభజన చట్టాన్ని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని, దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోందన్నారు. కేఆర్ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. దీంతో కృష్ణాడెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుందని సీఎం వైయస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం వైయస్ జగన్ లేఖ ద్వారా కోరారు.