తిరుపతి: సాక్షి పత్రికా కార్యాలయాలపై దాడి...ప్రజల గొంతు నొక్కే ప్రయత్నమే అంటూ వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ఏ ప్రజా గొంతుకను అరెస్టులతో అణచలేరన్నారు. తిరుపతిలోని తన నివాసంలో భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. `సాక్షి టీవీ డిబేట్లో క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ, వైయస్ఆర్సీపీ ఖండించింది, తీవ్ర అభ్యంతరం తెలిపింది. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో జరిగిన దానిపై క్షమాపణ చెప్పినా కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ అమరావతి రైతుల కుటుంబాలను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా రెండు రోజులుగా ఇదంతా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెడుతూ వైయస్ఆర్సీపీని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం. టీడీపీ నాయకులకు పత్రికలపై ప్రేమ కాదు, అధికార పార్టీ నాయకులు మా పార్టీ నేతలపై ఎంత నీచంగా మాట్లాడారో ప్రపంచానికి తెలుసు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని పాత్రికేయ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టం.. నిర్భందిస్తామనే సంకేతం ఇది. ఆయన అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికం, క్రిష్ణంరాజు వ్యాఖ్యలను సమర్ధించకపోయినా కూడా ఇంతలా మహిళలను రెచ్చగోడుతున్నారంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అందరికీ అర్ధమవుతుంది. అరెస్ట్లతో భయపెట్టాలనే ప్రయత్నమే ఇదంతా, మీ ఉక్కుపాదంతో అణిచివేయాలన్న సంకల్పాన్ని ఎవరూ సమర్ధించరు. వైయస్ జగన్ హయాంలో ఎవరెన్ని విమర్శలు చేసినా సంయమనం పాటించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీ, జనసేన గూండాల దాడిని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్నాన్ని పాతరేయాలని చూసే ప్రయత్నాన్ని అంతా అడ్డుకుంటారు` అంటూ భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.