తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. 12.03.2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రాజకీయ పార్టీ నేడు అత్యంత ప్రజాదరణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా తయారైంది. పార్టీని ప్రారంభించిన ఏడాదికే 17 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న వైయస్ఆర్సీపీ..2014 మేలో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి.. ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత రైతు భరోసా యాత్ర, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చేపట్టిన ధర్నా వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ఇచ్చాపురం నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 3648 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి ఊహించని మద్దతు లభించింది. గర్వంగా తలెత్తుకు తిరిగేలా.. జననేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడచిన పదిహేనేళ్లలో ఎన్నో సవాళ్ళను అధిగమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికారం చేపట్టిన 20నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని పార్టీ అధ్యక్షులు, నాటి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా శ్రీ వైయస్ జగన్ గారు అమలు చేసి... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ... ప్రతి కార్యకర్త గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందించారు. వైయస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సీపీ) రేపటితో 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టనుంది. 2011 మార్చి 12న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైయస్ఆర్సీపీ ప్రజా సమస్యలపై పోరాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగింది. 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన పార్టీ, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజల ఆదరణ పొందింది. వైయస్ జగన్ ఐదేళ్ల పాలన నవచరిత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలన(2019-2024)లో ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. సకల సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. గ్రామాల్లో రైతులకు భరోసానిచ్చేందుకు... ఏకంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. అవినీతికి తావులేని పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కొత్తగా 1.34 లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ఇక ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65 లక్షల మందితో వలంటీర్ల సైన్యం వచ్చింది. వైద్యుల్లేరనే మాటకు తావులేకుండా 10,592 గ్రామ, పట్టణ హెల్త్ క్లినిక్లు సేవలందించాయి వీటి ఫలితమేంటో తెలుసా..? కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు ఇష్టంగా వెళ్లారు. రుచికరమైన భోజనం.. స్కూళ్లు తెరవకముందే చేతికందే పుస్తకాలు, యూనిఫామ్.. ఇంగ్లీషు విద్య.. ఎడ్యుటెక్ కంటెంట్తో అందే ట్యాబ్లు... ఏపీ పిల్లల్ని ర్యాంకర్లను చేశాయి. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండా రైతుల్ని ఆర్బీకేలు చేయిపట్టి నడిపించాయి. విత్తు మొదలు పంట విక్రయం దాకా అన్ని సేవలూ అక్కడే పొందారు. హెల్త్ క్లినిక్లోని ఫ్యామిలీ డాక్టర్... ఊళ్లలో మంచానపడ్డ వారికి ఇంటికెళ్లి చికిత్స అందించారు. గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ అందాయి. అవ్వాతాతలకు వలంటీర్లు ఠంచనుగా పింఛన్ను తెచ్చి చేతిలో పెట్టారు. పేదలకు రేషన్ సరుకులూ ఇంటి ముంగిటకే వచ్చాయి. దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్లు పనిచేశాయి. ఇవన్నీ సాధ్యమయింది కేవలం ఐదేళ్లే. 2019 మే 30న సీఎంగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరవాతే!!. గత ఐదేళ్ల వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ దేశంలోనే రోల్ మోడల్గా నిలిచారు. సీఎంగా వైయస్ జగన్ అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్బీకే, రేషన్ డోర్డెలివరీ, వలంటీర్ వ్యవస్థ... ఇలా అన్నిటినీ ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. కొన్ని అమలు చేస్తున్నాయి కూడా!. మహిళలకు ‘పట్టా’భిషేకం ‘నిన్నటికన్నా నేడు బాగుంటే.. అదే అభివృద్ధి. ఊరైనా... మనుషులైనా’ అనేది వైయస్ జగన్మోహన్రెడ్డి విధానం. ఈ సూత్రంతోనే ఆయన ప్రచారానికి విలువివ్వకుండా పని చేస్తూ పోతున్నారు. సొంతింటికి నోచుకోని 31 లక్షల కుటుంబాల్లో... మహిళలకు ‘పట్టా’భిషేకం చేశారాయన. వారికి ఇళ్ల పట్టాలివ్వటమే కాదు. ఇళ్ల నిర్మాణమూ భుజానికెత్తుకున్నారు. చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయింది కూడా. ఇక నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి... అమలు చేశారు. తన కేబినెట్లో, ప్రభుత్వ పథవుల్లో మహిళలకు సగభాగమిచ్చి... చేతల మనిషిగా చరిత్ర సృష్టించారు. సామాజిక న్యాయానికి చుక్కాని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు (56 శాతం) అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఈ శాతాన్ని ఏకంగా 70కి పెంచారు. సామాజిక న్యాయానికి చుక్కానిగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీనీ పంపకున్నా... వైయస్ జగన్ మాత్రం 8 సీట్లలో సగం బీసీలకే ఇచ్చారు. ఇక స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల సమగ్ర సర్వేని చేపట్టడమే కాక... రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన... నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు. 3 లక్షల ఎకరాలను ఆ జాబితాను తొలగించారు. చుక్కల భూములు, షరతులు గల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. పారిశ్రామి అడుగులు ఆంధ్రప్రదేశ్కు సువిశాల తీరప్రాంతం ఉందంటూ గత పాలకుల్లా మాటలకే పరిమితం కాకుండా... కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్లు, మూడు ఎయిర్పోర్టుల నిర్మాణం చేపట్టింది వైయస్ జగన్ ప్రభుత్వం. మునుపెన్నడూ ఈ రాష్ట్రం వైపు చూడని... అంబానీ, అదానీ, జిందాల్, బంగూర్, భజాంకా తదితర దిగ్గజాలంతా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికగా విశ్వాసం వ్యక్తంచేయటమే కాక పెట్టుబడులూ పెడుతున్నారంటే... అది వైయస్ జగన్ గారి దార్శనికతపై భరోసాతోనే. అందుకే... గడిచిన ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్కు కొత్త చరిత్ర. ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివరికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు చేశారు. పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్పని పథకాలను సైతం అమలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంగా ఐదేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగమించి మరీ పథకాలు అమలు చేసి విశ్వసనీయతకు మారు పేరుగా పాలన సాగింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్నికలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. రైతన్నకు చేదోడుగా వైయస్ జగన్ వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం వైయస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వైయస్ఆర్ రైతు భరోసా, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, వైయస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైయస్ఆర్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తించారు. ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. కరువుతీరా కురిసిన వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపించాయి. భూగర్భ జలాలు ఎగసిపడ్డాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు వైయస్ జగన్ పాలనలో అమాంతంగా పెరిగాయి. ఐటీలోనూ మేటి.. వైయస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభించాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. గత ఐదేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్, రాండ్శాండ్, బీఈఎల్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, టెక్ మహీంద్రా, డబ్ల్యూఎన్ఎస్, టెక్నోటాస్క్, టెక్బుల్ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభించింది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్ బిజినెస్ పార్క్ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మరోవైపు విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. కూటమి పాలనలో కుంటుపడిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం (TDP-JSP-BJP) అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, వైద్య, విద్యా సంస్థల నిర్మాణాలు నిలిచిపోయాయి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన సిమెంట్ రోడ్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైద్య కళాశాలల పనులు నిలిచిపోయాయి. 20 నెలల కూటమి పాలనలో అభివృద్ధి కుంటుపడింది. భారీగా అప్పులు చేస్తూ సొంత ప్రచారానికి, దోపిడీకి ఉపయోగిస్తున్నారు. మట్టి, మద్యం, ఇసుక, మైన్స్ పేరుతో దోచుకుంటున్నారు. గత ప్రభుత్వ కాలంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను నిలిపివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేడుకలకు పార్టీ శ్రేణులు సిద్ధం రేపు(గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, గ్రామగ్రామాన, ప్రతీ పట్టణాల్లోని వార్డుల్లో, నగర కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్లలో వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించాలని, ఘనంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుల చేశారు. ఈ మేరకు పార్టీ పండుగ ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.