అభిమానం.. అపు'రూపం'

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా తమ అభిమానాన్ని పలువురు వినూత్నంగా చాటుకున్నారు. వెండి నాణెంపై, రావి ఆకుపై, కోడి గుడ్డుపై, విభిన్న పూలతో సీఎం జగన్‌ రూపాన్ని చిత్రీకరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ఆయా చిత్రాలు ఆకర్షిస్తున్నాయి. 


 

వెండి నాణెంపై.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన తల్లి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆప్యాయంగా అభినందించిన చిత్రాన్ని వెండి నాణెంపై చెక్కి ఔరా అనిపించారు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన స్వర్ణకారుడు, మైక్రో ఆర్టిస్ట్‌ ముగడ జగదీశ్వరరావు. 3 గ్రాముల వెండిపై 60 నిమిషాల్లో దీన్ని చెక్కినట్టు ఆయన తెలిపారు. 

పుష్పాభిషేకం 
తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం వివిధ రకాల పూలతో సీఎం వైఎస్‌ జగన్‌ రూపాన్ని తీర్చిదిద్దింది. చిట్టిబంతి, చామంతి, గులాబీలను వినియోగించినట్టు  సత్యనారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యం, గణపతి చెప్పారు. 

రావి ఆకుపై.. 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్‌.. పెన్సిల్‌ షేడ్స్‌తో, బియ్యం గింజలు, రాగులతో రావి ఆకుపై సీఎం జగన్‌ రూపాన్ని చిత్రీకరించారు.  


నవరత్నాలు వెరీ‘గుడ్‌’
నవరత్నాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన పొట్నూరి శ్రీనివాస్‌. కోడి గుడ్లపై నవరత్నాలతో పాటు, సీఎం జగన్‌ రూపాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు.   
 

Back to Top