రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రజలు క్యూకడుతున్నారు. ప్రైవేటు బడులను మానిపించి గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించేందుకు అత్యధికులు ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో అడ్మిషన్స్ లేవు అని బోర్డు పెట్టే స్థితిలో ప్రభుత్వ బడులు నేడు కనిపిస్తున్నాయి. ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గవర్నమెంట్ స్కూళ్లు ఈ స్థాయిలో అడ్మిషన్స్ చేయడం ఇదే తొలిసారి అంటున్నారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ బడులు అంటేనే నిరాసక్తత, వెన్ను విరిచే ఫీజులు ఉన్నా ప్రైవేటు బడులకే పిల్లలను పంపాలన్న తల్లి తండ్రుల ఆలోచనను మార్చి చూపింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సాగుతున్న వైఎయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్నే మార్చి చూపుతామన్నారు వైఎస్ జగన్. అమ్మ ఒడి పథకంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. విశాఖలోని చంద్రపాళెం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పది రోజుల్లో 1031 కొత్త అడ్మిషన్లు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక విద్యార్థులున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా రికార్డు సృష్టించిందీ స్కూల్. 42 సెక్షన్లు, 88 మంది ఉపాధ్యాయులు, 3550 మంది విద్యార్థులతో ఈ స్కూల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు వేదికైంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రభుత్వ పాఠశాలలు అడ్మిషన్లు లేవు అని బోర్డులు పెడుతున్నాయి. కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా జరిగిన ప్రవేశాలు 1.5 లక్షలు. ఇందులో తెలుగు మీడియం 42,893, ఇంగ్లీష్ మీడియం 30,327 అడ్మిషన్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల్లలో ఈ స్థాయి ప్రవేశాలు జరగడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడమే ఇందుకు కారణం. అరకొర సౌకర్యాలతో, అధ్యాపకుల కొరతతో కునారిల్లుతున్న ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చి దిద్దుతా అని ప్రజా సంకల్ప పాదయాత్రలో చెప్పారు వైయస్ జగన్. ప్రైవేటు స్కూళ్ల ఫీజు నియంత్రణ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్కూళ్లపై వేటు ద్వారా తన నిబద్ధతను చాటుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసినట్టుగా ప్రయోగాత్మకంగా జిల్లాకు కొన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం చేయడం, ఈ హాజర్, బయోమెట్రిక్ లకోసం అకటి అరా స్కూళ్లను ఎంపిక చేసుకోవడం లాంటి ఊగిసలాట నిర్ణయాలు కాదు. ప్రభుత్వ స్కూళ్లు అన్నిటిలోనూ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసారు ముఖ్యమంత్రి. ఉపాధ్యాయ నియామకాలను చేపడుతూ స్కూళ్లలో అధ్యాపకుల కొరత లేకుండా చేస్తున్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలలకు కూడా బస్సు సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి స్కూల్లోనూ టాయిలెట్ సౌకర్యాలు, పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలం, జిల్లా స్థాయి పాఠశాలలనుంచి ఉత్తమ ఫలితాలు రాబట్టే దిశగా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు సాహసోపేతంగా ఉంటున్నాయి. విద్యా వ్యవస్థను, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు యువ ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యలే ప్రజల్లో కదలికకు కారణం అయ్యాయి. విద్యావిధానంలో మార్పులు చేయడమే కాదు ప్రజల ఆలోచనలను కూడా మార్చే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రభుత్వ బడులు ఆదర్శంగా ఉండేలా రోజులు మారనున్నాయి. ప్రైవేటు బడులకు పంపే స్థోమతలేక, సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలలకు పంపలేక సతమతమౌతున్న పేదింటి విద్యార్థులకు అమ్మ ఒడి ఒక వరంలా మారింది. గత్యంతరం లేక అధిక ఫీజులతో ప్రైవేటు బడులను ఆశ్రయించే మధ్యతరగతి వర్గానికి ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ ఓ ఊరటగా మారింది. సమర్థుడైన నాయకుడు ఉంటే వ్యవస్థేకాదు, ప్రజల ఆలోచనా సరళీ మారుతుందని ఒక్క నెలలోనే నిరూపుణ అయ్యింది. మార్పుకు నాంది పలికి, ప్రజల్లో నమ్మకం కలిగించి ప్రభుత్వ పాఠశాలల గతినీ స్థితినీ మారుస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు జేజేలు పలుకుతున్నారు లక్షలాది విద్యార్థులు, ఇంకా వారి తల్లితండ్రులు.