పంచాయతీల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌భేరి

నాలుగు విడతల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభిమానుల విజయ దుందుభి

10 వేలకు పైగా పంచాయతీలు కైవసం

ఆఖరి విడతా అదే తీర్పు.. 

ముగిసిన పంచాయతీ ఎన్నికలు

ఈ విడతలోనూ 80 శాతానికిపైగా వైయ‌స్ఆర్‌‌సీపీ అభిమానులే గెలుపు

మొత్తంగా 13,097 పంచాయతీల్లో ఎన్నికలు.. 81.79 శాతం పోలింగ్‌

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైయ‌స్సార్‌సీపీ అభిమానుల గెలుపు సంపూర్ణమైంది. నాలుగో విడతలోనూ జైత్ర యాత్ర కొనసాగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు పల్లె ప్రజలు నాలుగు విడతల్లోనూ జైకొట్టారు. పాలనలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పల్లె ముంగిటకు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనకు గ్రామీణ ప్రజానీకం మొత్తం సానుకూలంగా స్పందించి బ్రహ్మరథం పట్టారు.

కుయుక్తులతో రాజకీయాలను నడపాలని ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీకి ప్రజలు ఓటుతో చావు దెబ్బ కొట్టారు. తెలుగుదేశం కంచుకోటలుగా జబ్బలు చరుచుకున్న ఆ పార్టీ నేతలకు దిమ్మ తిరిగే తీర్పును ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం గమనార్హం. కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీ విజయం నమోదు చేయడం.. టీడీపీ పతనానికి ప్రత్యక్ష సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

13,097 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే... 
మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, నాలుగు విడతల్లో కలిపి 13,097 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో మొత్తంగా 10 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. ఒకటి, రెండు, మూడవ విడతల్లో ఎన్నికలు జరిగిన వాటిలో 7,869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులను వైఎస్సార్‌సీపీ అభిమానులు చేజిక్కించుకున్నారు. నాలుగో విడతలోనూ ఆదివారం రాత్రి 12.30 గంటలకు అందిన సమాచారం మేరకు 80 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఈ తీర్పు ముఖ్యమంత్రి ప్రజా రంజక పాలనకు నిదర్శనం అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ఓటర్లు ఒక్క మాటగా అనుకొని ఓటు వేశారా.. అన్నట్టు 13 జిల్లాల్లోనూ, నాలుగు విడతల్లో ఒకే రకమైన ఫలితాలు రావడం ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని వారు పేర్కొన్నారు. ఈ తరహా ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే మొదటి సారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు.. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం తీసిపోవని అభివర్ణిస్తున్నారు. 
   

2,743 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌.. 

చివరి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 2,743 సర్పంచ్‌ పదవులకు ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఈ విడతలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 554 చోట్ల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌ జిల్లాలో రెండు చోట్ల అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,743 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆయా పంచాయతీల్లో పోలింగ్‌ ముగిసిన వెంటనే నాలుగు గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.  

 
82.85 శాతం పోలింగ్‌.. 
మిగిలిన మూడు విడతల కంటే నాలుగో విడత ఓటింగ్‌ శాతం కాస్త ఎక్కువగా నమోదైంది. తొలి మూడు విడతల్లో 80 – 82 శాతం మధ్య ఓటింగ్‌ శాతం నమోదు కాగా, నాలుగో విడతలో 82.85 శాతం పోలింగ్‌ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 76 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 81.79 శాతం పోలింగ్‌ నమోదైనట్టు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు.   

పులివెందుల ‘పంచ్‌’ అదిరింది
 
 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అభిమానులకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అగ్రాసనం దక్కింది. ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్‌ స్థానాలను అధికార పార్టీ అభిమానులు దక్కించుకుని విజయకేతనం ఎగుర వేశారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సొంత పంచాయతీ కసనూరులో సైతం టీడీపీ మద్దతుదారుడు అధికార పార్టీ అభిమానికి పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పరాజయం పాలయ్యాడు.

నియోజకవర్గంలో ఎక్కడా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ పెట్టలేని పరిస్థితికి చేరుకుంది. పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. 5 మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే విజయదుందుభి మోగించారు. కేవలం 8 గ్రామ పంచాయతీల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు పోటీలో నిలిచినా, ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. నంద్యాలంపల్లి, పైడిపాలెం, దుగ్గనగారిపల్లె పంచాయతీలలో మొత్తంగా కేవలం 6 వార్డులే ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు దక్కడం గమనార్హం. 

సంక్షేమ పథకాల ఫలితమిది..
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సొంత నియోజకవర్గం పులివెందులలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతోపాటు రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీఎంతో చర్చించి అభివృద్ధి పనులకు నిధులు తెప్పించడంలో ముందుంటున్నారు. దీంతో స్థానిక ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పట్టినట్లు స్పష్టమవుతోంది.

14 ఏళ్లు సీఎం.. 14 పంచాయతీలకు పరిమితం
సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో 100 శాతం పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పం నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉండగా 89 పంచాయతీలకు మూడవ విడతలో ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, టీడీపీ మద్దతుదారులు కేవలం 14 పంచాయతీల్లో గెలిచారు.

ఓట్ల పరంగా చూస్తే అధికార పార్టీ మద్దతుదారులకు ఏకంగా 31 వేల ఓట్లకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. కుప్పంలో అభివృద్ధి చేశానంటూ బూటకపు మాటలు చెప్పే చంద్రబాబుకు ఆ నియోజకవర్గ ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల కుప్పం ప్రజలు మొగ్గు చూపారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గంలో కేవలం 14 పంచాయతీలకు మాత్రమే పరిమితమయ్యారు. 

Back to Top