పంటకు బీమా లేదు.. రైతుకు ధీమా లేదు

పెద్దాపురం (తూ.గో.జిల్లా) : 'ఎదిగే చేనుకు కరెంటు లేదు. చేతికొచ్చిన పంటకు మద్దతు ధర లేదు. వానలు ముంచెత్తితే నష్టపరిహారం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో పంటల బీమా కింద రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. రైతులకు నేటికీ కిరణ్‌ ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చలేదు. పైగా సవరించిన పంటల బీమా పథకంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను 4.5 శాతం నుంచి 5.4 శాతానికి పెంచి అదనంగా ఆర్థిక భారం మోపింది.'

ఇలాంటి సమస్యలన్నింటినీ తూర్పుగోదావరి జిల్లా రైతులు శ్రీమతి షర్మిల వద్ద ఏకరువు పెట్టారు. రాజన్న తనయ, జగనన్న సోదరి శ్రీమతి షర్మిల వద్ద తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. కష్టాల సాగు చేయలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటి పాలకులు రైతుల పక్షపాతం వహించడం మాట అటుంచి కనీసం వారి పట్ల మానవతాదృక్పథంతో కూడా ఆలోచించడం లేదని వాపోతున్నారు.

మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతుల బతుకులకు ఒక భరోసా ఉండేది. ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల కడగండ్లను స్వయంగా తెలుసుకున్న వైయస్‌ఆర్ అధికారంలోకి రాగానే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత విద్యు‌త్ ఫై‌లుపై తొలి సంతకం చేశారు. 2007లో కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.50 మాత్రమే పెంచింది. ఈ నామమాత్రపు పెంపుతో ఎలాంటి ప్రయోజనం కలగడంలేదన్న రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న మహానేత వైయస్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా రూ.50లు బోన‌స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో లబ్ధి పొందలేని రైతులకు రూ.5,000 అందేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. కొబ్బరి రైతుల విజ్ఞప్తి మేరకు రెండు శాతం ఉన్న వ్యా‌ట్‌ను తొలగించి రైతుల గుండెల్లో చిరస్థాయిగా ముద్రవేసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కూడా మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి లక్ష రూపాయల చొప్పున సాయ‌ం అందించి ‘రైతు పక్షపాతి’ అనిపించుకున్న వైనాన్ని అన్నదాతలు గుర్తుచేసుకుంటున్నారు.

పజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కై‌, అంటకాగుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా జగనన్న సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం పెద్దాపురం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల రైతులు శ్రీమతి షర్మిలతో తమ బాధలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో సగ్గుబియ్యం (సాగో - కర్రపెండలం) సాగయ్యే ఏకైక జిల్లా తూర్పుగోదావరిలో నేడు ఆ పంట కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు శ్రీమతి షర్మిలకు వివరించారు. 35 వేల ఎకరాల్లో సాగవుతున్న సాగో పంటలో మెళకువలు అందచేసే రీసెర్చి సెంటర్‌ను కూడా తరలించుకుపోయారని వారు వాపోయారు. ఆ సెంటర్‌ను తిరిగి రైతుల వద్దకే తీసుకువచ్చేలా జగనన్న దృష్టికి తీసుకువెళతానని రైతులకు శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

చెరకు పంటకు చేయూత లేదు:

Sugarcane farmars met Smt. Sharmila in Peddapuramపాదయాత్ర మార్గంలో వెళుతున్న శ్రీమతి షర్మిల వద్దకు వడ్లమూరు సమీపంలో చెరకుతోటల్లో పనులు చేసుకుంటున్న రైతులు పరుగుపరుగున వచ్చారు. చెరకు సాగుకు ప్రభుత్వం చేయూతనివ్వడం లేదమ్మా అని గోడు వెళ్లబోసుకున్నారు. ‘వైయస్ అధికారంలోకి వచ్చే సమయానికి టన్ను చెరకు ధర రూ.1,100 ఉండేది. ‌ఆయన దాన్ని రూ.2,000కు పెంచారు. గడచిన నాలుగేళ్లలో టన్నుకు కేవలం రూ.200 మాత్రమే పెరిగింది. దీంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం’ అని రైతులు శ్రీమతి షర్మిలకు వివరించారు. ప్రస్తుతం చెరకు సాగుతో నష్టాలపాలై పొలాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని కంటతడిపెట్టారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ... మెట్ట రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా ఎలా ఉంది.. సాగునీరు అందుతుందా, వ్యవసాయాధికారులు వస్తున్నారా అని రైతులను ఆరా తీశారు.‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన రూ.138 కోట్లు ఖర్చు చేసి ఏలేరు ఆధునికీకరణ పూర్తిచేసి ఉంటే మెట్ట రైతులకు ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదని రైతులు శ్రీమతి షర్మిలకు వివరించారు. వారి కష్టాలు తెలుసుకున్న శ్రీమతి షర్మిల.. వైయస్ హయాంలో అమలైన రైతు సంక్షేమ పథకాలన్నీ జగనన్న కొనసాగిస్తారని భరోసా ఇచ్చారు. ‘రైతుల గోడు వినే సర్కారు కాదిది. రాబోయే రోజులన్నీ మంచి రోజులే. రాజన్న రాజ్యంలో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీకు గిట్టుబాటు ధర వస్తుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తారు. తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా జరుగుతుంది’ అని రైతులకు భరోసా ఇచ్చారు.

‌2,412.5 కిలోమీటర్లు పూర్తయిన షర్మిల పాదయాత్ర :

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 182వ రోజు సోమవారం ఉదయం 9.00 గంటలకు సామర్లకోట యూనియన్ బ్యాంక్ సమీపం నుంచి ప్రారంభమైంది. సామర్లకోట, పెద్దాపురం మీదుగా మరిడమ్మ ఆలయం వరకు ‌కొనసాగింది. మధ్యాహ్నం పెద్దాపురం ఆర్టీసీ కాంప్లెక్సు, జి.రాగంపేట, వడ్లమూరు, గోరింట మీదుగా శ్రీమతి షర్మిల పులిమేరుకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.20 గంటలకు చేరుకున్నారు. సోమవారం నాడు శ్రీమతి షర్మిల 14.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,412.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది.

Back to Top