'సమరదీక్ష'లో సమైక్య నినాదాల హోరు

గుంటూరు, 21 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చేస్తున్న ‘ సమరదీక్ష’ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపింది. వేల గొంతులు ఒక్కటయ్యేలా చేసింది. సమన్యాయంపై ప్రజలంతా విశేషంగా స్పందించేలా చేసింది. సమైక్యాంధ్ర సాధన కోసం సమరోత్సాహాన్ని తీసుకువచ్చింది. సమరదీక్ష శ్రీమతి విజయమ్మను చూసేందుకు వచ్చిన సందర్శకులతో దీక్షా శిబిరం కిక్కిరిసిపోయింది. ఆమెను పరామర్శించేవారు, సంఘీభావం ప్రకటించేవారి సంఖ్య భారీగా పెరిగింది. సమైక్యాంధ్ర నినాదాలతో గుంటూరు నగరం మార్మోగుతోంది.

సమైక్యాంధ్ర కోసం కదంతొక్కుతున్న గుంటూరు గడ్డపై శ్రీమతి వైయస్ విజయమ్మ సమరదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చే‌స్తున్నారు. ఆమె సమరదీక్ష నాయకులు, ప్రజల్లో కూడా సమైక్యస్ఫూర్తిని పూర్తిగా నింపింది. కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టిడిపిలు అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఎత్తి చూపింది. రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా 2008లో చంద్రబాబు నాయుడు ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖను‌ దీక్షా ప్రాంగణంలో బహిర్గతం చేశారు. లేఖ సారాంశాన్ని కరపత్రాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు. దీనితో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని జనం పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం కలిగింది. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన వచ్చినపుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ఆర్ దాన్ని తిప్పికొట్టిన వైనాన్ని వేదికపై నుంచి ‌పార్టీ నాయకులు తమ ప్రసంగాల్లో వివరించారు.

ఆద్యంతం ఆకట్టుకున్న విజయమ్మ ప్రసంగం:
సమరదీక్ష ప్రారంభించిన సోమవారం శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రసంగం ఎం‌త మందినో ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్ర రాజకీయాలు, భౌగోళిక స్థితిగతులు, సామాజిక వ్యవహారాలతో పాటు రాష్ట్ర విభజన ఎందుకు చేశారో ఆమె తన ప్రసంగంలో వివరించిన తీరు దీక్షా ప్రాంగణంలో ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు రాష్ట్రం ఎలా ఉన్నదీ, ఆయన మరణించిన తరువాత ఏ విధంగా దిగజారిపోయింది అనే విషయాలను వివరిస్తూ, రెండేళ్లుగా వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను శ్రీమతి విజయమ్మ తన ప్రసంగంలో పూసగుచ్చినట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ‘సమన్యాయం’ అంటూ శ్రీమతి విజయమ్మ చేస్తున్న ఉద్యమానికి అర్థం జనానికి బోధపడింది.

రెండవ రోజున సమరదీక్షా శిబిరం అభిమానులు, స్థానికుల రాకతో కిటకిటలాడిపోయింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి పార్టీ నాయకులే కాకుండా సమైక్యవాదులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. వికలాంగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి మహిళలు వచ్చి శ్రీమతి విజయమ్మ దీక్షకు సంఘీభావంగా నిలిచారు. గుంటూరులోని ముస్లిం మత పెద్దలు శ్రీమతి విజయమ్మను నిండు మనసుతో ఆశీర్వదించారు. స్కూలు విద్యార్థులు, వికలాంగులు కూడా స్వచ్ఛందంగా వేదికపైకి వచ్చి శ్రీమతి విజయమ్మకు మద్దతుగా, సమైక్యవాదాన్ని వినిపించారు.

Back to Top