బాబుది అధికార ఆరాటం- జగన్‌పై పోరాటం

హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2013 :

చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు కారణం 'అధికారం కోసం ఆరాటం.. శ్రీ జగన్‌పై పోరాటం' అని  వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకుడు దాడి వీరభ‌ద్రరావు అన్నారు. రాష్ట్రం అనిశ్చిత పరిస్థితుల్లో ఉందని, దాన్ని చక్కదిద్దాలని చెబుతున్న చంద్రబాబు నాయుడే నిజానికి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై సిబిఐ విచారణ పూర్తయినట్లు తెలియగానే చంద్రబాబు భయంతో బస్సు యాత్రను అర్ధంతరంగా వాయిదా వేసుకొని కుట్రలు చేయడానికి ఢిల్లీ వెళ్ళారని ఆరోపించారు. శ్రీ జగన్‌కు బెయిల్ రాకుండా చేయడానికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి స‌హా అన్ని పార్టీల నేతలను ఆయన కలిశారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో దాడి వీరభద్రరావు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు అని చంద్రబాబు పైకి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. శ్రీ జగన్ బెయి‌ల్పై బయటకు వస్తే తనకు రాజకీయ భవిష్య‌త్ ఉండదని ఆయన భయపడుతున్నారని అన్నారు.

చంద్రబాబు నాయడు ఢిల్లీకి ఏ ప్రతిపాదనలతో వెళ్ళారని దాడి ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల టిడిపి నాయకులను ఢిల్లీ తీసుకు వెళ్లడం వెనుక ఉన్న రాజీ మార్గం ఏమిటని అడిగారు. ఇరు ప్రాంతాల నాయకులు కూడా ఏదో ఒక రాజీ మార్గానికి అంగీకరించారా? వెల్లడించాలన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు సమైక్యాంధ్రకు అంగీకరించారా లేక సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకున్నారా? చెప్పాలన్నారు. రెండు ప్రాంతాల వారిని ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడ ఏమి చెప్పారని చంద్రబాబును ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలకు చంద్రబాబ చెప్పింది సమైక్యాంధ్ర గురించీ కాదు.. తెలంగాణ వాదం గురించీ కాకుండా.. కేవలం శ్రీ జగన్మోహన్‌రెడ్డి గారికి బెయిల్‌ ఇవ్వకూడదని అక్కడి అన్ని రాజకీయ పార్టీలనూ ప్రభావితం చేస్తున్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వకుండా నిరోధించాలని రాష్ట్రపతిని, ఇతర రాజకీయ పార్టీల నాయకులను చంద్రబాబు కోరారని దాడి ఆరోపించారు.

చంద్రబాబు నాయుడి ఢిల్లీ యాత్రకు ఎజెండా సమైక్య వాదం అని చెబుతున్నప్పటికీ.. అసలు ఎజెండా మాత్రం శ్రీ జగన్‌ గురించే అని వీరభద్రరావు విమర్శించారు. రాజకీయ నాయకులెవరైనా తన ప్రత్యర్థులను ప్రత్యక్ష రాజకీయాల్లో ఢీకొనడానికి సిద్ధపడాలన్నారు. శ్రీ జగన్‌ బయటికి వచ్చి.. ఆయన- చంద్రబాబు కూడా రాష్ట్రంలో హుందాగా పర్యటనలు చేయడం ఒక నీతి అన్నారు. అది ధర్మ యుద్ధం అన్నారు. ప్రత్యర్థిని జైలు నుంచి బయటికి రానివ్వకూడదు.. బయటికి వస్తే.. అదొక ప్రభంజనం అయిపోతుంది.. తాను మటాష్‌ అయిపోతాను అనే భయాందోళనలతో చంద్రబాబు అనిశ్చితిలో ఉన్నారని దాడి ఎద్దేవా చేశారు.

ఏదో ఒకలా తాను అధికారంలోకి రావాలన్న ఆరాటమే చంద్రబాబులో కనిపిస్తోందని దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. ఒక పక్కన సమైక్యాంధ్ర అంటారని, మరో పక్క ప్రత్యేక తెలంగాణ అంటారని, ఇంకో పక్కన తనకు అధికారం ఇవ్వండి.. ఆరు నెలల్లోపల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాననడాన్ని ఆయన తూర్పారపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు పరిష్కారాలు తన దగ్గర ఉన్నప్పుడు నిన్న రాష్ట్రపతికి చెప్పవచ్చు కదా అన్నారు. రాష్ట్ర సమస్యలకు పరిష్కారాలు ఉంటే వాటిపై తన అభిప్రాయాలను ప్రజలకు నిర్దిష్టంగా చెప్పాలన్నారు. వేరే కండిషన్లు లేవు.. సమైక్యరాష్ట్రమే తమ డిమాండ్‌ అని స్పష్టంగా చెబుతున్నారని, తెలంగాణ వారు కూడా తమకు కండిషన్లు లేవని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని చెబుతున్నారని ఈ నేపథ్యంలో ఇంక పరిష్కారం ఏమి ఉందని దాడి నిలదీశారు.

ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తే.. సీమాంధ్రుల సెంటిమెంటును గౌరవిస్తే.. ఈ అనిశ్చిత పరిస్థితి తొలగే వరకూ సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించండి అని చంద్రబాబు ఒక్క మాట ఎందుకు అనలేకపోతున్నారని వీరభద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబుది ప్రజలను మోసగించే విధానమే తప్ప మరొకటి కాదన్నారు. కాంగ్రెస్‌వారిని కలవనని చంద్రబాబు చెబుతున్నారని అయితే వారిని పగలు కాకుండా చీకట్లో మాత్రమే రహస్యంగా కలుసుకుని కుట్రలు చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పక్కన ఉంటే కార్పొరేట్‌ సంస్థల యజమానులైన ఎంపిలు కేంద్ర మంత్రులతో ఎలాంటి సయోధ్య నడుపుతున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసు అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై పోరాటం చేయదలచుకుంటే.. దాని కోసమే వెళ్ళామని ధైర్యంగా చెప్పాలని చంద్రబాబుకు దాడి సూచించారు. సమైక్య ఉద్యమం కోసం వెళ్ళానని అబద్ధాలు చెప్పాల్సిన అగత్యం ఏమొచ్చిందన్నారు.

అబద్ధాలు చెప్పడానికి కూడా చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడం లేదని దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం సమస్య పరిష్కారానికి వెళ్ళానని చంద్రబాబు చెబుతున్న మాట శుద్ధ అబద్ధమన్నారు. రాష్ట్రపతిని కలిసేందుకు అనుమతి కోరుతూ చంద్రబాబు తన సంతకంతో పంపించిన లేఖలో 'వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయనకు సంబంధించిన వారి అవినీతి, మనీ లాండరింగ్‌ కేసులపై విచారణకు సంబంధించి చర్చించడానికి మీ అనుమతి కావాలి' అని స్పష్టంగా పేర్కొనడాన్ని దాడి మీడియా సమావేశంలో చదివి వినిపించారు. ఈ లేఖలో సమైక్యాంధ్ర గురించి ఒక్క వాక్యమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసమే ఢిల్లీ వెళ్ళినట్లు చెబుతున్న చంద్రబాబు లేఖలో  రావణకాష్టంలా మారిపోయిన రాష్ట్రం గురించి, సీమాంధ్ర ఉద్యమం గురించి ఒక్క వాక్యమైనా ఎందుకు లేదని చంద్రబాబును ఆయన నిలదీశారు. ప్రజలు చంద్రబాబు ఇప్పటికింకా మోసం చేస్తూనే ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత మోసకారి గనుకే చంద్రబాబును సీమాంధ్రులు గాని, తెలంగాణ వారు గాని నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఉభయభ్రష్టుడు అయ్యారన్నారు. తనను తానే నాశనం చేసుకునే ఒక వ్యవస్థగా చంద్రబాబు తయారయ్యారని విమర్శించారు. టిడిపిని ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో స్థాపించారో వాటిని తుంగలో తొక్కి టిడిపినిని కాంగ్రెస్‌కు పిల్ల పార్టీగా తయారు చేశారని దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు.

విచారణ పూర్తయిన తరువాత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ పొందడానికి అర్హుడు అని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని వీరభద్రరావు తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ అనివార్యమని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఆదేశాల మేరకూ శ్రీ జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసిందని, ఆ విషయాన్ని సిబిఐ కోర్టుకు రాతపూర్వకంగా తెలియజేసిందన్నారు. శ్రీ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్నదని, తీర్పును రిజర్వు చేసిన వైనాన్ని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సిబిఐ కోర్టును ప్రభావితం చేసే విధంగా చంద్రబాబు నాయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి గారి బెయిల్‌ గురించి ప్రకటనలివ్వడం, రాష్ట్రపతి దగ్గర మాట్లాడడం, బెయిల్‌ ఇవ్వకుండా చూడమని ప్రధానిని కోరడం ఎంత వరకూ సబబు అని వీరభద్రరావు నిప్పులు చెరిగారు. ఇది కోర్టు ధిక్కార నేరం కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ళు సిఎంగా, మరో తొమ్మిదేళ్ళుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వ్యక్తికి తగిన పనేనా అని ఆయన నిలదీశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటికి వస్తే.. టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు బతకవని కనుక ఆయనను లోపలే ఉంచండి, ఎన్నికలైపోయే వరకూ బయటికి రానివ్వకండి అని చంద్రబాబు నాయుడు చెప్పడం తగునా అని దాడి అన్నారు.

ఒక పక్కన తాను కలవదలచుకున్న కేంద్ర నాయకులను కలుస్తూనే.. మరో పక్కన బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా చంద్రబాబు కలుసుకోవడాన్ని దాడి వీరభద్రరావు తప్పుపట్టారు. రాజ్‌నాథ్‌ను కలవడంలో రాజకీయ కారణాలు లేవని చంద్రబాబు చెబుతున్నారన్నారు. మరి ఎందుకు వెళ్ళారని మీడియా ప్రశ్నిస్తే.. వ్యక్తిగతం అన్నారన్నారు. రాజకీయ నాయకులకు వ్యక్తిగతం ఏమిటండీ అని ఎద్దేవా చేశారు. రాజ్‌నాథ్‌కు చంద్రబాబుకు ఉన్న వ్యక్తిగత సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మోడిని ముఖ్యమంత్రిగా తీసేయకపోతే.. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని ఎక్కడ బడితే అక్కడ ఎవరూ అడగక ముందే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ప్లేటు ఫిరాయిస్తున్నారని నిలదీశారు. అంటే బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందేమో.. మోడి ప్రధాని అయిపోతారేమో అనే భయమా? అన్నారు.

శ్రీ జగన్‌కు బెయిల్‌ రానివ్వకుండా ఉపయోగించుకునేందుకు 2014 వరకూ‌ కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని దాడి వీరభద్రరావు ఆరోపించారు. అంతే కాకుండా తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై సిబిఐ లాంటి ఏ విధమైన విచారణలూ జరగకుండా మేనేజ్‌ చేసుకోవడమూ ఆ చీకటి ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం అన్నారు. 2014లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తుందేమో అని దానితో చంద్రబాబు స్నేహ సంబంధాలు ప్రారంభించారని విమర్శించారు. ఇదేనా టిడిపి విధానం అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు దేని కోసం ఢిల్లీ వెళ్ళారు అక్కడ ఏం మాట్లాడారు వివరంగా చెప్పండన్నారు.

చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై 1998లో 'ప్రజా కోర్టులో బిజెపి చార్జిషీట్‌' వేసిన వైనాన్ని దాడి ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చినట్లయితే.. చంద్రబాబు పరిపాలన మీద తాము కేంద్ర ప్రభుత్వం చేత విచారణ జరిపిస్తామని ప్రకటించిన విషయాన్ని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం 100 తప్పుల చేసిందని, వాటిని ఆ చార్జిషీట్‌లో పొందుపరిచిన వైనాన్ని గుర్తుచేశారు. ఆ చార్జిషీట్‌లోని నేరాలపై ఎన్‌డిఎ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మేనేజ్‌ చేసుకోవడానికే చంద్రబాబు ఆ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారని చెప్పారు. అంత వరకూ బిజెపిని తిడుతున్న చంద్రబాబు, చంద్రబాబుపై విరుచుకుపడుతున్న బిజెపి 1999లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. 2014లో ఎక్కడ బిజెపి అధికారంలోకి వచ్చి తనపై మరిన్ని తప్పులతో చార్జిషీట్‌ వేసి విచారణకు ఆదేశిస్తుందో అనే భయంతోనే చంద్రబాబు ముందస్తుగా దానితో దోస్తీకి సిద్ధమయ్యారని దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పేదొకటి, నాయకులకు చెప్పేదొకటి.. బయటికి చెప్పేది మరొకటని, ఇంట్లో చెప్పేదొకటి, ఇంటి బయట మరొకటని వీరభద్రరావు విమర్శించారు. పార్టీ ఆఫీసులో ఒకటి.. బయట చెప్పేదొకటి అన్నారు. ఇలాంటి అనిశ్చితమైన మనసుతో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని దాడి వ్యాఖ్యానించారు. కడప ఎన్నికలప్పుడు, ఉప ఎన్నికల సందర్భంలో బిజెపితో శ్రీ జగన్‌ కుమ్మక్కైపోయారు.. బిజెపి సంగతి మనం చూడాలని చెప్పిన చంద్రబాబు అవన్నీ మర్చిపోయి అవకాశ వాదంతో ఎవరితో ఎలాంటి ఒప్పందాలకైనా దిగజారిపోవడం ఆయన నైజం అని దాడి దుమ్మెత్తిపోశారు.

చంద్రబాబుది సమైక్య వాదమా? తెలంగాణ వాదమా? లేక పలాయన వాదమా? అని దాడి వీరభద్రరావు సూటిగా ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకుండా దూరంగా పారిపోవడం దానికి ఓ కథ చెప్పడం చంద్రబాబుకు అలవాటే అని విమర్శించారు. ఈ ప్రపంచంలో అందరి కంటే తానే బిజీగా ఉన్నట్లు పెద్ద బిల్డప్‌ ఇస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చంద్రబాబు నిర్ణయం ఏమిటో, తమ సిద్ధాంతం ఏమిటో చెప్పాలని నిలదీశారు. ప్రజలను మరోసారి మోసం చేయవద్దని హెచ్చరించారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించమని కేంద్రాన్ని కోరతారా? లేదా? స్పష్టం చేయాలని చంద్రబాబును వీరభద్రరావు సూటిగా ప్రశ్నించారు.

Back to Top