బీఏసీ భేటీ నుంచి వైయస్ఆర్‌సీపీ వాకౌట్

హైదరాబాద్, 17 డిసెంబర్ 2013:

శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సభ్యులు శాసనసభా వ్యవహారాల కమిటీ‌ (బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ‌బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. సమైక్య తీర్మానం కోసం తాము పట్టుపట్టినట్లు ఆమె తెలిపారు.

సమైక్య తీర్మానం తరువాతే అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ ప్రక్రియ ప్రారంభం కావాలని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు. ఇంతకు ముందు రాష్ట్రాల విభజన సమయంలో ఏ నిబంధన‌లు పాటించారో వాటినే పాటించాలని తాము కోరినట్లు తెలిపారు. సమైక్య తీర్మానానికి అంగీకరించనందున తాము‌ బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు చెప్పారు. తుపానును అడ్డుకోలేకపోయాను, విభజనను ఆపుతానని ముఖ్యమంత్రి కిర‌ణ్ కుమా‌ర్‌రెడ్డి ప్రగల్భాలు పలికారని విమర్శించారు.

ముఖ్యమంత్రి కూడా కాస్త విరామం తీసుకుని బిల్లుపై చర్చిద్దామన్నారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. అంటే ఆయన ఉద్దేశం కూడా ఇదే విడత సమావేశాల్లో బిల్లుపై చర్చించాలనేనని ఆమె చెప్పారు. తాము మాత్రం సమైక్య తీర్మానం చేసిన తర్వాతనే చర్చల్లో పాల్గొంటామని స్పష్టంచేసినట్లు తెలిపారు. బడ్జెట్‌ ప్రంసగాలకూ మూడు నాలుగు రోజుల సమయం ఉంటుందన్నారు. తీర్మానం చేసేంత వరకూ తాము పోరాడతామని చెప్పారు. సభను అడ్డుకుంటాం, కార్యకలాపాలను స్తంభింపచేస్తామని శ్రీమతి విజయమ్మ హెచ్చరించారు.

Back to Top