జనాన్ని జైళ్ళలోకి నెట్టి వేడుకలా?

అనంతపురం, 15 ఆగస్టు 2013:

అనంతపురం పోలీస్ పరే‌డ్ మైదానంలో గురువారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కింద కూర్చొని నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రె‌స్‌ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఆయన దుయ్యబట్టారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. రాజకీయ లబ్ఢి కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ విభజిస్తోందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారంటూ మంత్రి రఘువీరారెడ్డి ప్రసంగాన్ని గురునాథరెడ్డి ఈ సందర్భంగా అడ్డుకోబోయారు. భారీ భద్రత మధ్య అనంతపురంలో స్వాతంత్ర్య దిన వేడుకలు నిర్వహించారు. వేడుకలను చూసేందుకు ప్రజలను అనుమతించలేదు. పోలీసులు భారీగా మోహరించారు.

ఈ సందర్భంగా గురునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాచిందని‌ నిప్పులు చెరిగారు. ప్రజలను అర్ధరాత్రి జైళ్ళకు తరలించి స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహిస్తున్న తీరు వల్లే తాను కింద కూర్చుని నిరసన తెలిపానన్నారు. అనంతపురం జిల్లా మంత్రి ఆదేశాలతోనే ప్రజలను జైళ్ళలో పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిందా? లేక ఇంకా విదేశీయుల చేతుల్లోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని గురునాథరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

విదేశీ మహిళ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం మంత్రులుగా ఉన్నందువల్లే ఉన్నందునే వారు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారన్నారని ఎమ్మెల్యే గురునాథ రెడ్డి విమర్శించారు. జిల్లాను అన్ని వైపులా దిగ్బంధించి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరించడానికి మాత్రమే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున తాను నిరసన వ్యక్తంచేశాను కానీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కాదని అన్నారు. రాష్ట్ర ప్రజల మనో భావాలను గౌరవించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని తమ పార్టీ కోరుతోందన్నారు.

Back to Top