ఏలూరు జిల్లా: ఆక్వా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి జూలై 15న భీమవరం పర్యటించడం ఖాయమని, ఆ పర్యటనను ఎలాంటి ఆంక్షలతోనూ అడ్డుకోలేరని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని బువ్వనపల్లిలో నిర్వహించిన వైయస్ఆర్సీపీ ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఆక్వా మేత ధరలు విపరీతంగా పెరిగినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్ని నాని అన్నారు. మేత కంపెనీలు, పాలకులు కుమ్మక్కై రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. దీంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. ఆక్వా రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే తగిన సమయంలో రైతులే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడాలంటే మేత ధరల నియంత్రణతో పాటు రైతులకు తక్షణ ఉపశమన చర్యలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైయస్ జగన్మోహన్రెడ్డి జూలై 15న భీమవరం పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని స్పష్టం చేశారు. హెలిప్యాడ్కు అనుమతి నిరాకరించినా, ఇతర ఆంక్షలు విధించినా జగన్ వెనక్కి తగ్గరని, అవసరమైతే రైలులో ప్రయాణించి అయినా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు వైయస్ఆర్సీపీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ భీమవరం పర్యటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యలు మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారనున్నాయని, ప్రభుత్వం రైతుల డిమాండ్లపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.