<strong>అందినకాడికి దోచుకోవడమే టీడీపీ నేతల పని</strong><strong>వైయస్ఆర్ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు</strong>పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. భూములు మొదలు మట్టి, ఇసుక అన్నీ అందినకాడికి టీడీపీ నేతలు దోచుకుంటున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గంలోని ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చెరువులు తవ్వి మట్టిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం మాని అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ధాన్యం అమ్మకాల్లో కూడా టీడీపీ నేతలు దళారులుగా మారి రైతులను పీడిస్తున్నారని ఆరోపించారు. <br/>ఎమ్మెల్యేగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాను పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందజేశానని కారుమూరి చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క టీడీపీ నేతలనే అభివృద్ధి చేస్తుందన్నారు. అదే విధంగా వైయస్ఆర్ సీపీ సానుభూతి పరులకు పెన్షన్లు, రేషన్ కార్డులు ఊడబెరికి అరాచకం సృష్టిస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రక్షణ కరువైందన్నారు. టీచర్ కదిలే శవాలని కలెక్టర్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఇటీవల కొందరు ఉద్యోగులు వచ్చి వైయస్ జగన్తో మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. జిల్లాలో పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని, ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వారి సమస్యలు వింటున్న వైయస్ జగన్ సమస్యల పరిష్కారానికి అధ్యయనం చేస్తూ ముందుకుసాగుతున్నారన్నారు. <br/>