అమృతం ఇస్తే, విషం క­క్కుతున్నారు

హైదరాబాద్ : రాష్ట్రం సమైక్యంగా
ఉండాలన్నదే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  లక్ష్యం అని పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే పురోగతి సాధించగలమన్నారు. అందుకే
విభజనను అడ్డుకోండని శ్రీజగన్ జాతీయ నాయకులను కలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోకుండా
ఉండేందుకు ఆయన తన ప్రయత్నాలు తను చేస్తున్నారని తెలిపారు. అధికారం అనే అమృతాన్ని
ఇస్తే, కాంగ్రెస్ వారు విషం కక్కుతున్నారన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి  రాష్ట్రాన్ని  విభజిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.



ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా
నియంతృత్వ ధోరణితో ఏ విధంగా అయినా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ కంకణం
కట్టుకుందని తమ్మినేని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్
వారు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే మొట్టమొదటి భాషా
ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారని సీతారాం
కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం
చేసేందుకు వేసిన జస్టిస్ శ్రీక్రిష్ణ, రోశయ్య, ఆంటోనీ కమిటీల్లో దేని నివేదిక ఆధారంగా
రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని నిలదీశారు. దేశ వ్యాప్తంగా కొత్త రాష్ట్రాల
కోసం సుమారు 22 డిమాండ్లు కేంద్రం వద్ద ఉండగా ఆంధ్రప్రదేశ్ ను మాత్రమే ఎందుకు
ముక్కలు చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు.

 

ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ
తూట్లు పొడుస్తోందని, ఖూనీ చేస్తోందని, దేశ భద్రతకు భంగం కలిగిస్తోందని తమ్మినేని
దుయ్యబట్టారు. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి తెలుగుజాతికి తీరని ద్రోహం
చేస్తున్నారని తూర్పారపట్టారు. రాష్ట్రాన్ని విభజించమని లేఖల మీద లేఖలు రాసిన
చంద్రబాబుకు సమైక్యంగా ఉంచమని ఒక్క లేఖ రాయడానికి చేతులు రావడం లేదని ఆగ్రహం
వ్యక్తంచేశారు. పైపెచ్చు రాష్ట్రాన్ని కొబ్బరికాయలా సమంగా పగలగొట్టాలంటూ కాంగ్రెస్
కు చంద్రబాబు ఉచిత సలహాలు ఇవ్వడమేమిటని మండిపడ్డారు.

 

Back to Top