కాంగ్రెస్‌ చెవికి ఎక్కని కోట్లాది మంది అభిమతం

జంగారెడ్డిగూడెం :

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర కేబినె‌ట్ ఆమోదించకుండా నివారించలేకపోయిన సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శలు గుప్పించారు. వారి వల్లే తెలుగుజాతికి ఈ దుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన బంద్ కార్యక్రమాల్లో బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని విడదీయ వద్దని కోట్లాది మంది  గొంతెత్తి అరుస్తున్నా కాంగ్రెస్ వారి చెవి‌కి ఎక్కడం లేదన్నారు. తెలుగు ప్రజలను విడదీస్తున్న పాపం ఊరికే పోదని, రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌తో పాటు దానికి సహకరించిన టీడీపీలు త్వరలోనే బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని అన్నారు.

కేంద్ర మంత్రులు, ఎంపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బాలరాజు హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని, అప్పుడు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా జలాలు, హైదరాబాద్, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల భద్రత, భద్రాచలం వంటి అంశాలు అనేకం ఉన్నప్పటికీ.. వాటిని ప్రస్తావించకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top