కడప)) తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీ లో చేరారు. వైయస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ అంబాబత్తిన రెడ్డెయ్య ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు యనమల కొండమ్మతో పాటు వారి కుమారులు యనమల మదన్మోహన్, యనమల వెంకటరమణ వైయస్సార్సీపీలో చేరారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన ఈడిగపల్లె, యనమలవాండ్లపల్లె, వడ్డెపల్లెకు చెందిన 50 కుటుంబాలకు పైగా టీడీపీకి చెందిన వారు వైయస్సార్సీపీలో వైయస్ జగన్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికీ చేరకపోవడంతో ప్రజల్లోకి వెళ్లి సరైన సమాధానం చెప్పలేకపోతున్నందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని, రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ వస్తే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా కల్పించినట్లు తెలియజేశారు.