అడ్డగోలు విభజనను అడ్డుకోండి

హైదరాబాద్ : కేంద్రం అడ్డగోలుగా చేస్తున్న రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరి కొద్ది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నిలువునా ముక్కలు చేయడం ఎంతమాత్రమూ తగదని చెప్పారు. పార్టీ లోక్‌సభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన బృందంతో కలిసి శ్రీ జగన్‌ గురువారంనాడు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగపరమైన అంశాలు, ఇంతకు ముందు పాటించిన విధివిధానాలను తెలియజేస్తూ ఈ సందర్భంగా నాలుగు పేజీల వినతిపత్రాన్ని రాష్ట్రపతికి అందజేసింది. శ్రీ జగన్‌తో కలిసి వెళ్లిన ప్రజాప్రతినిధులందరూ విభజనకు వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్వీయ అఫిడవిట్లు రాష్ట్రపతికి అందజేశారు.

రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో శ్రీ జగన్‌ మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని, వారి అభిమతానికి భిన్నంగా కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే అంశంతో పాటు రాష్ట్రాల విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వాలు గతంలో పాటించిన పద్ధతులు, ఏదైనా ఒక కమిషన్, కమిటీ సిఫారసుల మేరకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను ఉపయోగించి రాష్ట్రాలను విభజించాలన్న జస్టిస్‌ పూంచీ కమిషన్‌ సూచనలు, ఇతర అంశాలను వినతిపత్రంలో పొందుపరిచారు.

వినతిపత్రంలోని ముఖ్యాంశాలు :
- ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రజలు, ఎమ్మెల్యేలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ క్రమంగా పార్టీ పరపతి కోల్పోతూ ఒకదాని తరువాత మరొక  రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న కాంగ్రెస్‌ తెలంగాణలో కొన్ని సీట్ల కోసం ఈ విభజనకు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించాలని చూస్తోంది.

- కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన జస్టిస్‌ సర్కారియా కమిషన్, జస్టిస్‌ పూంచీ కమిషన్‌లు చేసిన సిఫారసులు, రాజ్యాంగపరమైన సంప్రదాయాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తూ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించింది. రాష్ట్రాల విభజనకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద చర్యలు తీసుకునే ముందు ఏదైనా కమిషన్, కమిటీ చేసిన సిఫారసులను ప్రాతిపదికగా తీసుకోవటం, లేదా విడగొట్టాలనుకున్న రాష్ట్ర అసెంబ్లీ నుంచి విభజనకు అనుకూలంగా తీర్మానం తీసుకోవాల్సి ఉంటుందని ఈ రెండు కమిషన్లు చేసిన సిఫారసులను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.

- రాష్ట్రాల విభజన సందర్భంగా గతంలో పాటించిన సంప్రదాయాలు, విధానాలను ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనే ఎందుకు పక్కన పెట్టి కుతంత్రాలు పన్నుతోంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసి 461 పేజీల నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా చెప్పింది. (శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో రాష్ట్రాన్ని కలిపి ఉంచడమే మేలన్న విషయాన్ని నొక్కి చెప్పిన విషయాన్ని ఇక్కడ పొందుపర్చారు)

- శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఇంతటి ప్రాధాన్యత ఉన్న నివేదికపై ఇరు ప్రాంతాల వారితో విస్తృతంగా చర్చించకపోవడం దురదృష్టకరం. కనీసం అసెంబ్లీ నుంచి తీర్మానం కూడా తీసుకోకుండా ఉన్నపళంగా అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. న్యాయపరమైన ఈ కమిటీ నివేదికను కేంద్రం ఎందుకు విస్మరించిందో ఊహలకు అందడంలేదు. కమిటీ చేసిన సిఫారసులు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే కాదా?

- కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు సుదీర్ఘ కాలంగా ఉన్నప్పటికీ ఒక్క తెలంగాణను మాత్రమే కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకురావడం కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. నాగపూర్‌ రాజధానిగా చేస్తూ విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తొలి రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ 1956లో సిఫారసు చేసింది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలు చేయాలని అక్కడి అసెంబ్లీ మూడేళ్ల క్రితమే తీర్మానం చేసి పంపినా కేంద్రం పక్కనపెట్టింది.

- కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అప్పటి వరకూ అనుసరిస్తున్న విధానాలను కూడా విస్మరించారు. 2000 సంవత్సరంలో విదర్భ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు అప్పటి కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తాము అనుసరిస్తున్న విధానాలను పేర్కొంటూ విదర్భ రాష్ట్రం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నందువల్ల దానిని పక్కనపెడుతున్నామని వెల్లడించారు.

- ఈ రాజ్యాంగపరమైన సంప్రదాయాల నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం చెల్లుబాటు కావు. ప్రజాస్వామ్యానికి, చట్టానికి కట్టుబడి ఉన్న ఒక రాజకీయ పార్టీగా మేము ఇటీవల ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అనేకసార్లు ఈ అప్రజాస్వామిక విభజనను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశాం. అసెంబ్లీని సమావేశ పరచి రాష్ట్ర విభజనపై అభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌లను కూడా కోరాం. కానీ దురదృష్టవశాత్తూ విభజన ప్రక్రియ మాత్రం ఎలాంటి సంప్రదాయాలు, విధానాలు పాటించకుండా ముందుకే పోతోంది.

- ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు -2013 ముసాయిదాను తొందరపాటుతో చేసినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీకి కూడా అంతే వేగంగా పంపారు. బిల్లు ఉద్దేశాలు, కారణాలు కూడా పొందుపరచకుండా, అనేక ప్రధాన అంశాలకు సంబంధించి సమాచారం ఇవ్వకుండా బిల్లు పంపారు. దీనిని బట్టి కేంద్రం దీనిపై ఎలాంటి చర్చా విపులంగా జరగకూడదని భావించినట్లు ఉంది. ఇలా చర్చ జరగకపోవడం వల్ల 8.4 కోట్ల మంది ప్రజలు గల రాష్ట్రంపై ఆ ప్రభావం పడుతుంది.

- ఇంతటి ముఖ్యమైన అంశం మీద రాష్ట్రంలోని సీనియర్‌ నాయకులకు మెజారిటీ శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలపై ఏ మాత్రం గౌరవం లేనట్లు వారి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. అసెంబ్లీ తీర్మానం గురించి రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. అందుకే మేం విభజనను గట్టిగా వ్యతిరేకిస్తూ అత్యున్నతమైన రాజ్యాంగ అధినేత అయిన మీకు అఫిడవిట్లను సమర్పిస్తున్నాం.
- మా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకిస్తూ అఫిడవిట్లను సమర్పిస్తున్నాం. అవిశ్వాసంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హతకు గురి చేయకుండా కొంత కాలం సాగదీసి వారిని ఎమ్మెల్యేలుగా లేకుండా చేసేందుకు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాం. ఉపఎన్నికలు జరిగి ఉంటే వారంతా తిరిగి ఎన్నికైతే రాష్ట్ర విభజనను వ్యతిరేకించేవారే అని మనవి చేస్తున్నాం. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ రాష్ట్ర విభజనను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

శ్రీమతి విజయమ్మను పలుకరించిన ప్రణబ్ :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను ప్రణబ్‌ ముఖర్జీ పలుకరించి క్షేమ సమాచారాలు అడిగారు. పార్టీ ప్రతినిధి బృందంతో 15 నిమిషాలకు పైగా రాష్ట్రపతి భేటీ అయ్యారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రరెడ్డి అందించిన వినతిపత్రాన్ని, ప్రజాప్రతినిధులు సమర్పించిన స్వీయ అఫిడవిట్లను ఆయన స్వీకరించారు. రాష్ట్ర విభజన ఏ మాత్రం శ్రేయస్కరం కాదని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వివరిస్తున్నపుడు రాష్ట్రపతి సావధానంగా వింటూ అఫిడవిట్‌లోని అంశాలను పూర్తిగా పరిశీలించారు.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన పార్టీ ప్రతినిధి బృందంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభా నాగిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పినిపె విశ్వరూప్, రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పేర్ని వెంకటరామయ్య, జోగి రమేష్, కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మద్దాల రాజేశ్‌ ఉన్నారు.
Back to Top