సీమాంధ్రలో రహదారులన్నీ బంద్

హైదరాబాద్, 6 నవంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే ప్రజల ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు స్పష్టంగా అర్థమయ్యేలా చేసేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ఉదయం ప్రారంభించిన 48 గంటల రహదారుల దిగ్బంధం తొలిరోజున విజయవంతంగా కొనసాగింది. సమైక్యవాదులంతా స్వచ్ఛందంగా ఈ రహదారుల దిగ్బంధం ఆందోళనలో పాల్గొన్నారు. వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీమాంధ్రలోని రహదారులన్నీ బుధవారం దిగ్బంధం అయ్యాయి. దీనితో లక్షలాది వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రహదారులన్నీ సమైక్య నినాదాలతో హోరెత్తాయి. పలు చోట్ల ఉద్యమకారులు రోడ్లపైనే వంటా వార్పులు చేశారు. మానవహారాలు నిర్మించారు. విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభించింది. వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.


జై సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్రలోని జాతీయ, రాష్ట్ర రహదారులన్నీ బుధవారం హోరెత్తిపోయాయి. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో రహదారులన్నీ స్తంభించాయి. ‌దీనితో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు 48 గంటల రహదారుల దిగ్బంధంను విజయవంతం చేశారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే రోడ్లపై బైఠాయించి జై సమైక్యాంధ్ర.. జై జగన్ నినాదా‌లను మిన్నంటించారు. రోడ్లపై మానవహారాలుగా నిలబడ్డారు. వంటావార్పులు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేశారు. జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై ప్రతి ఇరవై కిలోమీటర్లకూ పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు. ఒక్కో జిల్లాలో హైవేపై కనీసంగా పాతిక, ముప్పై చోట్ల ఆందోళనలు చేపట్టారు. దీంతో జాతీయరహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి.

ఇక రాష్ట్ర హైవేలు, పంచాయతీరాజ్ రహదారులపై వాహనాలను అటకాయించారు. వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల ఆందోళనకు సీమాంధ్ర ప్రజలు బాసటగా నిలబడ్డారు. పల్లె ప్రాంతాల్లోనూ గ్రామీణులు వేలాదిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లను నరికి రోడ్డుపై పడేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. అంబులెన్సులు, 108 వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చిన పార్టీ శ్రేణులు మిగిలిన అన్ని వాహనాలనూ అడ్డుకున్నారు. రాత్రిపూట కూడా పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగించారు. రోడ్లపై కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టారు.

పార్టీ ముందుగానే పిలుపునిచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థలు బుధవారం మూతపడ్డాయి. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. కొన్నిచోట్ల డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులు గంటలసేపు ఆలస్యంగా ప్రయాణించాయి.

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయాలని యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ హడావుడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఈ ఆందోళనకు ప్రయాణికులు, వాహనదారులు సంఘీభావం ప్రకటించారు. పలు చోట్ల రోడ్లపై స్వచ్ఛందంగా వాహనాలు నిలిపి పార్టీ శ్రేణులతో కలిసి సమైక్యనినాదాలు చేశారు. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించడంతో వాహనాల డ్రైవర్లు, సిబ్బంది, ప్రయాణీకులకు పార్టీ నేతలే భోజనాలు ఏర్పాటు చేశారు.

ఇటీవలి కాలంలో ఏ రాజకీయపార్టీ చేపట్టని విధంగా తొలిసారిగా 48 గంటల సేపు రోడ్ల దిగ్బంధానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును ముందే ఊహించిన పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా ఆయా జిల్లాల్లో రాస్తారోకోలను ఒక్కచోటకే పరిమితం చేయకుండా, బృందాల వారీగా కార్యకర్తలను పలుచోట్లకు పంపి రోడ్లను దిగ్బంధించారు. బుధవారం ఒక్కరోజే 13 జిల్లాల్లో 3054 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

పోలీసుల అత్యుత్సాహం... అనంతపురంలో ఉద్రిక్తత :
అనంతపురంలో రాస్తారోకో చేస్తున్న పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. మహిళలని కూడా చూడకుండా బలంవంతంగా లాక్కెళ్లి జీపులో పడేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన తేరుకున్న తర్వాత అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ పార్టీ శ్రేణులు పోలీస్‌ స్టేషన్ ఎదుట బైఠాయించాయి.

‌కనేకల్లులో పార్టీ కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధర్నా చేశారు. పార్టీ కార్యకర్తలు ఎస్కేయూ వర్శిటీని బం‌ద్ చేయించి.. 205 రహదారిని దిగ్బంధించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల ముట్టడి చేపట్టారు. కర్నూలులోని తుంగభద్ర నదిపై ఉన్న బ్రిడ్జిని దిగ్బంధించి ఇరువైపులా రాకపోకలను స్తంభింపజేశారు. నంద్యాల, ఆళ్లగడ్డల్లో 18వ నంబర్ జాతీయ రహదారిని దిగ్భందించారు. డోన్‌లో 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలువరించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు-బళ్లారి రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

‌వైయస్ఆర్ జిల్లా‌ వ్యాప్తంగా 45 చోట్ల రోడ్లను దిగ్బంధించారు. కడపలో కర్నూలు-చెన్నై, కడప-రాయచోటి రహదారులపై ఉదయం 6 గంటల నుంచే కార్యకర్తలు బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాకపోకలు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు గేటు ఎదుట బైఠాయించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట-తిరుపతి రహదారిని దిగ్భందించారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు.

తిరుమలనూ తాకిన దిగ్బంధం సెగ :
రహదారుల దిగ్బంధం కారణంగా తమిళనాడులోని వేలూరు మార్గం, కర్నాటక నుంచి వచ్చే బస్సులు, బెంగళూరు బస్సులు నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పంలో బస్సులు కర్ణాటక సరిహద్దు వరకు వచ్చి నిలిచిపోయాయి. పుంగనూరు వద్ద ఆందోళనకారులు పెద్ద పెద్ద చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. చంద్రగిరి వద్ద జాతీయ రహదారి ట్రాక్టర్లతో నిండిపోవడంతో అటువైపు వాహనాలు వెళ్లలేదు. పుత్తూరు, నగరి, నాగలాపురం, నారాయణవనంలో రోడ్లను దిగ్బంధం చేయడంతో చెన్నైకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో రాస్తారోకో చేశారు. చంద్రగిరిలో  తిరుపతి-చిత్తూరు రోడ్డుకు  50 ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి వాహనాలను అడ్డుకున్నారు.

జాతీయ రహదారిపైనే వంటావార్పు :
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు అడ్డరోడ్డు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐదు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించింది. ఇబ్రహీంపట్నంలో ‌జాతీయ రహదారిపైనే వంటావార్పు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్ష‌న్ వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పామర్రులో రోడ్డును దిగ్బంధించి వంటావార్పు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ‌ప్రకాశం జిల్లా  కనిగిరిలో ఉదయం 5.30 గంటలనుంచే బస్సులను ఉద్యమకారులు అడ్డుకున్నారు. దర్శిలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట, మంగళగిరి, పెదకాకాని వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు గంటల తరబడి ఆందోళన చేయడంతో కిలోమీటర్ల మేర చెన్నై హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సత్తెనపల్లిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో‌ గుంటూరు-మాచర్ల రహదారిని ట్రాక్టర్లు అడ్డుపెట్టి దిగ్బంధించారు. గుంటూరులో నాయకులు అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ నేత ముస్తఫా జాతీయ రహదారిపై వంటా వార్పు ఏర్పాటు చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలూ రోడ్డుపైనే.. :
తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రి వద్ద మోరంపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అమలాపురంలో ఎర్ర వంతెన వద్ద పార్టీ నేతలు కార్యకర్తలు 216 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి  జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉదయం 9 గంటల నుంచే టెంట్లు వేసి వాహనాల రాకపోకలకు అడ్డుపడటంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రత్తిపాడు వద్ద రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వాహనాలను అడ్డుకున్నారు.

విజయనగరం జిల్లాలో ఉదయం నాలుగు గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో నిర్వహించిన దిగ్బంధం వల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి‌తో పాటు రాష్ట్రీయ రహదారులను దిగ్బంధించారు. పార్టీ ఎమ్మెల్యే కృష్ణదాస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూర‌ల్ పోలీ‌స్ స్టేష‌న్ వద్ద జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

విశాఖ జిల్లా పాడేరులో ఉదయం 5 గంటల నుంచే పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో వారపు సంతకు వెళ్లే వాహనాలు గంటల‌ తరబడి నిలిచిపోయాయి. కె.కోటపాడులో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నర్సీపట్నంలో రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి రహదారుల్ని దిగ్బంధించారు. జిల్లా మీదుగా వెళ్లే 16వ నెంబరు జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడంతో గంటలసేపు వాహనాలు నిలిచిపోయాయి.‌ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలాచెరువు సెంటర్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో, రావులపాలెం వద్ద  మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పార్టీ నాయకుడు పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. తణుకు నియోజకవర్గం సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో ఎన్ హెచ్-16‌ ను దిగ్బంధించారు. తాడేపల్లిగూడెంలో కన్వీనర్ తోట గోపీ నేతృత్వంలో జాతీయ‌ రహదారి దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. కుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏలూరు వద్ద జాతీయ రహదారిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు దిగ్బంధించాయి. నగర కన్వీనర్ గుడిదేసు శ్రీనివాసరావు, మార్కె‌ట్‌ యార్డు వైస్ ఛైర్మన్ మంచం మైబాబు, పలువురు కార్పొరేటర్లు ఇందులో పాల్గొన్నారు.

ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి వద్ద దెందులూరు నియోజకవర్గం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడి ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి‌పోయింది. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడు తోట చంద్రశేఖర్‌, కన్వీనర్లు పీవీరావు, అశోక్‌గౌడ్‌, కొటారు రామచంద్రరావు, జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మద్దాల రాజేష్‌కుమార్‌, డాక్టర్ కర్రా రాజారావు నేతృత్వంలో జంగారెడ్డిగూడెంలో ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి దిగ్బంధించారు. బాలరాజు, రాజేష్ కుమార్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో పులివెందులలో దిగ్బంధం :
సమైక్యాంధ్రకు మద్దతుగా వైయస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ నాయకుడు వైయస్ అవినా‌ష్‌రెడ్డి ఆధ్వరంలో రహదారుల దిగ్బంధం బుధవారం జరిగింది. దాంతో పులివెందుల, ఆ పరిసర ప్రాంతాలలో రహదారులపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ నాయకులు సురేష్ బాబు, అంజా‌ద్ భాషా ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. ‌దానితో  ఇస్కాన్ సర్కిల్, రాజంపేట, వై‌యస్ఆర్ సర్కిళ్లలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

వైయస్ఆర్ ‌కాంగ్రెస్ ‌నాయకుల అరెస్టు :
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ చేపట్టిన రహదారుల దిగ్భంధంపై పోలీసులు ‌అత్యుత్సాహం ప్రదర్శించారు. సీమాంధ్రలో రహదారుల దిగ్బంధంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను పలుచోట్ల అరెస్టు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకుంటున్న పార్టీ నేత గౌతంరెడ్డిని పోలీసులు బుధవారం బలవంతంగా అరెస్టు చేశారు. ఆయనతో పాటు పార్టీ ఇతర నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టులు, నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేవని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పార్టీ కన్వీనర్‌ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో గరికపాడు వద్ద 9వ నంబర్ హైవేను దిగ్బంధించారు. ఉదయభాను సహా పలువురు నేతలను పోలీసులు అరె‌స్టు చేశారు.

ప్రకాశంజిల్లాలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. ఒంగోలు శివార్లలోని త్రోవగుంట వద్ద ఐదవ నంబర్ జాతీయ రహదారిపై పార్టీ కార్యకర్తలు, నాయకులు బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలో రహదారుల దిగ్బంధం కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యాంధ్ర డిమాండ్‌తో పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల చెక్‌పోస్టును దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందని ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top