ప్రజల బాధలంటే చీమ కుట్టినట్టైనా లేదా?

నగరి (చిత్తూరు జిల్లా) :

అనేక సమస్యలతో అన్నదాతలు సతమతం అవుతున్నా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి చీమకుట్టినట్టు కూడా లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీది మన దేశం కాదు, మన భాష కూడా తెలీదని, అయితే రాష్ట్రాన్ని మాత్రం అడ్డగోలుగా విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగవ విడత ఆరవ రోజు యాత్ర శనివారం రాత్రి నగరిలో జరిగిన బహిరంగ సభలో శ్రీ జగన్ ప్రసంగించారు.
ప్రజ‌లను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అన్న కుట్రల్లో వారు మునిగి తేలుతున్నారని శ్రీ జగన్‌ విమర్శించారు. కరెంటు బిల్లులు కట్టలేక నేత కార్మికులు, మద్దతు ధర దక్కక చెరకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే చిత్తూరు జిల్లాకే చెందిన సీఎంకూ పట్టదు... ప్రతిపక్ష నేతకూ పట్టదంటూ ఆయన నిప్పులు చెరిగారు.

‘చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న నా దగ్గరకు కొందరు నేత కుటుంబాల అక్క చెల్లెమ్మలొచ్చారు. అన్నా కరెంటు బిల్లు నాలుగైదు వేల రూపాయలొస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నగరి పరిసరాల్లో 15 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఒక్కో మగ్గానికి సగటున నెలకు 300 యూనిట్లు కరెంటు ఖర్చవుతుంది. యూనిట్‌కు రూ.3.55 చొప్పున బిల్లు వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా సర్‌చార్జి అని, ఇంధన చార్జీలని, రకరకాల పేర్లతో కరెంటు బిల్లు నాలుగైదు వేల రూపాయలు వస్తోంది. అదే పది కిలోమీటర్ల అవతల ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారంటూ మరమగ్గాల కార్మికులు వాపోయారు. గతంలో దివంగత ‌మహానేత సీఎంగా ఉన్నప్పుడు రూ.1.75 ఉన్న కరెంటు చార్జీలను సగానికి తగ్గించి 87 పైసలకే ఇచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా జీవో కూడా జారీచేశారు. ఆ జీవో కాపీ తీసుకుని కరెంటు వాళ్ల దగ్గరకు వెళితే నాడు దివంగత నేత ఇచ్చిన జీవో ఇప్పుడు చెల్లదంటున్నారని మరమగ్గాల కార్మికులు వాపోయార'న్నారు.

ప్రజా సమస్యలపై కిరణ్, చంద్రబాబు నిర్లక్ష్యానికి మరో సజీవ సాక్ష్యం నగరిలోనే కనిపించిందని శ్రీ జగన్‌ అన్నారు. నగరి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‘సమ్మర్ స్టోరే‌జ్ ట్యాంక్’ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. ఆ‌యన మరణించి నాలుగేళ్లు దాటుతున్నా ఆ ట్యాంకుకు ఈ ప్రభుత్వం నీటిని సరఫరా చేయలేదని దుయ్యబట్టారు.

ఈ విభజన అన్యాయం:

ప్రజలకు వంటగ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. కరెంటు బిల్లులు షా‌క్ కొడుతున్నాయి. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చార్జీల మోత మోగుతోంది. ‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 రోగాలను తప్పించేశారు. విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ సమస్యల్లో వేటి‌ మీదా అసెంబ్లీలో చర్చించడం లేదు. సమస్యలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని ఎలా విభజించాలో చర్చిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇంత అన్యాయంగా విభజన ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. రాష్ట్రంలో 70 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నా ఖాతరు చేయకుండా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అని బాధేస్తుంది.

సోనియా గీచిన గీత దాటని సీఎం ఉండడం వల్లే ఇంత ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని విభజించే ధైర్యం ఆమెకు వచ్చింది. పాలక పక్షాన్ని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత ప్యాకేజీల కోసం కుమ్మక్ము రాజకీయాలకు పాల్పడుతుండటం వల్లే సోనియాకు అంత తెగువ వచ్చింది. త్వరలో వచ్చే ఎన్నికల్లో మనమే సొంతంగా 30 పార్లమెంటు సీట్లు సాధించుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top