జగన్మోహన్ రెడ్డితో షర్మిల భేటీ

హైదరాబాద్  05 ఆగస్టు 2013:

వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల సోమవారం ఉదయం చంచల్‌గుడా జైలుకు వెళ్ళి తన అన్నను కలిశారు. పాదయాత్ర  వివరాలను ఆమె ఆయనకు వివరించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో విశాఖ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న శ్రీమతి షర్మిల సరాసరి జైలుకు వెళ్ళారు. పార్టీ పట్ల రాష్ట్ర ప్రజానీకానికి ఉన్న అశేష అభిమానాన్ని తెలియజేశారు. తొలుత శంషాబాద్ విమానాశ్రయం వద్ద శ్రీమతి వైయస్ షర్మిలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు,  కార్యకర్తలు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. పార్టీ గౌరవాధ్యక్షురలు శ్రీమతి వైయస్ విజయమ్మతో కలిసి ఆమె విచ్చేశారు.  పార్టీ నేత పుత్తా ప్రతాప రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క  చేయకుండా రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. శ్రీమతి షర్మిల.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. జగన్నినాదాలతో విమానాశ్రయం మార్మోగింది.
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో సుదీర్ఘ పాదయత్ర చేసిన మహిళగా డాక్టర్ర వైయస్ఆర్ తనయ అయిన శ్రీమతి షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో  ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  పాదయాత్రలో షర్మిల మోకాలుకు గాయం కావడంతో కొంతకాలం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజులలో ఆమె పూర్తి చేశారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు.

Back to Top