సమైక్య శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, 20 అక్టోబర్ 2013: ఈ నెల 26న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’
బహిరంగ సభపోస్టర్ ను ఆదివారం సాయంత్రం పార్టీ
కేంద్ర కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ
విభజించరాదని డిమాండ్ చేస్తూ శ్రీ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభను
నిర్వహించాలని నిర్ణయించారు.

 ‘జనం మాటే జగన్ బాట’ నినాదంతో
రూపొందించిన ఈ పోస్టర్ ను, రాష్ట్ర సమైక్యంగా ఉండాల్సిన
ఆవశ్యకతను వివరించిన కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తెలుగుతల్లి
చిత్రంతో పాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి చిత్రాలను పోస్టర్ లో
పొందుపరిచారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, కోటింరెడ్డి వినయ్ రెడ్డి, ఆదం విజయ్ కుమార్, లింగాల హరిగౌడ్, మహ్మద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... సమైక్య శంఖారావం ఒక చారిత్రక అవసరం అన్నారు.
సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభను చూసిన
తర్వాతైనా ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర పాలకులు విభజన నిర్ణయం మార్చుకుంటారనే
ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Back to Top