చిత్తూరు: రాయలసీమ లో పుట్టిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, రాయలసీమ కోసం పాటు పడే పార్టీ మాదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం వైయస్ జగన్, తనను విమర్శించడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మరో కార్యక్రమం లేదని ధ్వజమెత్తారు. శుక్రవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.. కుప్పం లో ఓడిపోతాను అని తెలిసి చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని, అందుకే తిట్ల పురాణం కు తెర తీశారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పం కు చేసింది ఏమి లేదని ఆయన మండిపడ్డారు. హంద్రీనీవా కాలువ పూర్తి చేసి కుప్పం కు నీరు అందిస్తే దానిపైన విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. వైయస్ఆర్సీపీ హంద్రీనీవా పనులు పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబుకు బాధగా ఉందని, అందుకే పూర్తి కాలేదు అని విమర్శలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి మాడా అని మాట్లాడారని గుర్తు చేశారు. మాపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే ఓట్లు రూపంలో మీ అందరికీ బుద్ది చెపుతారని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.